– మత విద్వేష వ్యాప్తిని తిప్పికొట్టాలి
– 10-11 తేదీల్లో కాశ్మీర్ పర్యటన
– ‘ఎమర్జెన్సీ’లో ఆర్ఎస్ఎస్ బూటకపు పాత్రను ఎండగట్టాలి
– దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిగతుల్ని ప్రజలకు వివరించండి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కీలక నిర్ణయాలు
– కేంద్ర కార్యదర్శివర్గం ఏర్పాటు
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, పహల్గాం ఉగ్రదాడిని ఉపయోగించి మతోన్మాద విద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలను తిరస్కరిస్తూ ఈ నెలలోనే వారం రోజుల పాటు ప్రచారోద్యమం చేపట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. అలాగే ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం జూన్ 10-11 తేదీల్లో కాశ్మీర్లో పర్యటించనుంది. ఈ బృందంలో పొలిట్బ్యూరో సభ్యులు, ఎంపీ (లోక్సభ) ఆమ్రారామ్, ఎంపీ, కేంద్ర కమిటీ సభ్యులు కే రాధాకృష్ణన్, ఎంపీ (రాజ్యసభ), కేంద్ర కమిటీకి ఆహ్వానితులు జాన్ బ్రిట్టాస్, ఎంపీ (రాజ్యసభ) వికాశ్ రంజన్ భట్టాచార్య, ఎంపీ (లోక్సభ) వెంకటేశన్, ఎంపీ (రాజ్యసభ) ఏఏ రహీమ్ ఉంటారు. గాజాపై ఇజ్రాయిల్ ఊచకోతకు నిరసనగా యావత్ పార్టీ శ్రేణులు తక్షణం నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజా స్వామ్యానికి మద్దతుగా, ఎమర్జన్సీ ప్రకటనకు 50ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రస్తుత ప్రభుత్వ నిరంకుశ వాదాన్ని ఎండగడుతూ కార్యక్రమాలు నిర్వహిం చాలని పిలుపునిచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ బూటకపు పాత్రను బహిర్గతం చేసేం దుకు ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలని దిశానిర్దేశం చేసింది. సీపీఐ(ఎం) 24వ అఖిల భారత మహాసభలో ఎన్నికైన పార్టీ కేంద్ర కమిటీ ఈ నెల 3-5తేదీల్లో హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో సమావేశమైంది. ఇటీవల ఉగ్రదాడుల్లో, ఈశాన్య ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో, బెంగళూరులోని తొక్కిసలాటలో మరణించిన వారికి కేంద్ర కమిటీ సంతాపం తెలిపింది. దేశ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించిన అనంతరం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ నిర్మాణపరమైన అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
పహల్గాం ఉగ్రదాడుల తర్వాత…
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో దేశ ప్రజలు ఏకతాటిపై నిలబడ్డారని కేంద్ర కమిటీ తెలిపింది. దీనిలో జమ్మూ కాశ్మీర్ ప్రజల స్పందన ఆదర్శప్రాయంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల హింసకు నిరసనగా వారు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియచేశారు. అయితే హిందూత్వ శక్తులు, ప్రజల సమైక్య సంకల్పానికి పూర్తి విరుద్ధంగా, ఉగ్రదాడిని ముస్లింలపైన, కాశ్మీరీలపైన విద్వేషప్రచారం చేపట్టేందుకు ఉపయోగించు కోవాలని చూశాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని, బీజేపీ ఈ మిలటరీ ఆపరేషన్ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం కూడా దీన్ని ఉపయోగించుకోడానికి ప్రయత్నించారు. దీనికి బీహార్, పశ్చిమ బెంగాల్ల్లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాలే ప్రత్యక్ష ఉదాహరణలు. 370 అధికరణం, ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాక, అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి ఎలా వచ్చాయో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందనీ, అలాంటి లోపభూయిష్టమైన వైఖరే భద్రతా లోపాలు, లొసుగులకు దారి తీసింది. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని గుర్తించారే తప్ప, ఇప్పటికీ వారిని పట్టుకోలేదు. ఈ వైఫల్యాలకు బాధ్యులు, జవాబుదారీ ఎవరో ముందుగా నిర్ధారించాలి.
మే 10న కాల్పుల విరమణ ప్రకటనలో అమెరికా జోక్యాన్ని కేంద్ర కమిటీ తప్పు పట్టింది. ఆదేశ అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఇదే విషయాన్ని చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటివరకు సమర్ధవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. దీన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య సమస్యల పరిష్కారంలో విదేశీ జోక్యం దేశ రాజకీయ ఏకాభిప్రాయానికి పూర్తి వ్యతిరేకం. ఉగ్రదాడులు, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యావత్ ప్రతిపక్షం డిమాండ్ చేసినా ప్రభుత్వం తిరస్కరించడాన్ని కేంద్ర కమిటీ ఖండించింది. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రధాని దేశమంతా పర్యటిస్తూ ఓ రకమైన యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే యత్నం చేశారని తెలిపింది. ప్రధాని మోడీ తాను వెళ్ళిన చోటల్లా చేసిన ప్రసంగాల్లో మిలటరీ ఆపరేషన్ను ప్రస్తుతానికి నిలుపుదల చేశామే తప్ప, పూర్తిగా ఆపేయలేదని చెబుతున్నారనీ, అంటే దీన్ని బీజేపీ రాజకీయ ప్రాజెక్టుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నదని స్పష్టమవుతున్నది.
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సైనిక మార్గాలు మాత్రమే ఏకైక పరిష్కారం కాదని సీపీఐ(ఎం) ఎప్పుడూ చెప్తూనే ఉందనీ, తీవ్రవాదంపై పోరాడేందుకు దౌత్య, రాజకీయ, ఇతర చర్యలను కూడా అనుసరించాల్సి వుందని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటించిన కొత్త సిద్ధాంతం ఈ మార్గాలన్నింటినీ ముందుగానే మూసివేసి, యుద్ధోన్మాదానికి ఆజ్యం పోస్తుందని తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న తీవ్రవాద శక్తులను బలోపేతం చేస్తూ, మత పరమైన విభజనను మరింత పెంచుతుందని స్పష్టం చేశారు.
దేశ ఆర్థికవ్యవస్థ వాస్తవ స్థితిగతుల్ని వివరించండి
భారతదేశ ఆర్థిక పరిస్థితి వాస్తవికతను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కప్పిపెడుతోంది. ఈ ఏడాది చివరినాటికి జపాన్ను భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించబోతోందని, నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందని ఊదరగొడు తున్నారు. భారత్, జపాన్ మధ్య తలసరి ఆదాయాల్లోని భారీ తేడాలను దాచి పెడుతూ ఈ ప్రచారం సాగు తోంది. మనదేశ ఆర్థికవ్యవస్థలో పెరుగుతున్న అసమానతలు, కార్మికుల జీవనోపాధుల సంక్షోభం వంటివి వాస్తవిక అంశాలు. పార్టీ శ్రేణులు వాటిని ప్రజలకు వివరించి చెప్పాలి.
పారదర్శకంగా లేని అంతర్జాతీయ ఒప్పందాలు
ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై సంతకం చేయాలనేది భారత ప్రభుత్వ లక్ష్యంగా వుంది. జులైలోగా, తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. అమెరికా డిమాండ్లకు అనుగుణంగా వివిధ వస్తువులపై సుంకాలు తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందం ( బీటీఏ) భారత రైతాంగం జీవనోపాదికి ముప్పుగా పరిగణిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ను, ఔషధ రంగాన్ని అత్యంత దారుణంగా దెబ్బ తీస్తుంది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతున్నా, భారత్లో ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. బ్రిటన్తో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ పారదర్శకంగా లేవు. రైతులు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేవు, ఆందోళనలు అసలే లేవు. భారత కార్మిక వర్గం, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడే ఇటువంటి ఒప్పందాలన్నింటినీ కేంద్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
సుప్రీం తీర్పుల అమలుకు తిరస్కరణ
గవర్నర్ల అధికారాలు, రాష్ట్రాల శాసనసభల సంకల్పాన్ని గౌరవించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తున్నది. ఈ తీర్పుపై రాష్ట్రపతి నివేదన పేరుతో సుప్రీం కోర్టుకు పలు ప్రశ్నలను సంధించారు. ఇది బీజేపీ నిరంకుశవాద వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఇది సమాఖ్యవాదం సూత్రాలను ధిక్కరించడమే.
సార్వత్రిక సమ్మెకు మద్దతు
కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన జులై 9 నాటి సార్వత్రిక సమ్మెకు కేంద్ర కమిటీ పూర్తి మద్దతును కేంద్ర కమిటీ ప్రకటించింది. అదే రోజు, రైతు, వ్యవసాయ కార్మికులు కూడా తమ డిమాండ్లపై నిరసనలు నిర్వహిస్తున్నారు. సమ్మెను విజయవంతం చేయడానికి చురుకుగా ప్రచారం చేయాలని పార్టీ శాఖలు, సభ్యులకు పిలుపునిచ్చింది.
ఈశాన్యంలో వరదలు
ఈశాన్య రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 36 మందికి పైగా మరణించారు. 5 లక్షల మందికి పైగా నిరాశ్రయుల య్యారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, తగిన రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టేలా చూడాలి.
ఎన్నికలు
ఈ ఏడాది అక్టోబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించేందుకై సంయుక్తంగా కృషి చేసేందుకు బీహార్లో వామపక్ష, లౌకిక ప్రతిపక్ష పార్టీలతో సీపీఐ(ఎం) చర్చలు ప్రారంభించింది.
తప్పని జన, కులగణన
ఉద్దేశ్యపూర్వకంగా, అసాధారణ రీతిలో జాప్యం జరిగిన తర్వాత 2027లో సాధారణ జనగణన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించాల్సి వచ్చింది. దానితో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పారు. అయితే దీనికోసం అనుసరించాలనుకుంటున్న పద్దతులు, ప్రభుత్వ ఉద్దేశ్యాలపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేసి ఈ అంశాలన్నింటినీ చర్చించాలి.
విద్వేష ప్రచారం
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మైనారిటీలపై విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులను, ఆర్మీ ప్రతినిధిని, విదేశాంగ కార్యదర్శిని ట్రోలింగ్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మౌనంగా ఉంది. ఇది విద్వేష ప్రచారానికి రహస్య తోడ్పాటును అందిస్తున్నట్టే భావించాల్సి ఉంటుంది. కార్పొరేట్ మీడియాకులోని ఓ సెక్షన్ ఈ యుద్ధోన్మాదానికి మద్దతుగా ప్రచారం చేయడం సరైంది కాదు. వలస వచ్చిన ముస్లింలు ముఖ్యంగా బెంగాలీ మాట్లాడేవారిని బంగ్లాదేశీయులుగా చూస్తూ వారిని లక్ష్యంగా చేసుకొని, బలవంతంగా తరలిస్తూ, బీజేపీ మంత్రులు, నేతలు అత్యంత దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ తన ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చేలా నయా ఉదారవాద విధానాలను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తుంది.
గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణ
గాజా, దాని అనుబంధ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ సాగిస్తున్న ఊచకోతను కేంద్ర కమిటీ ఖండించింది. బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయిల్కు ఆయుధాల ఎగుమతిని తక్షణమే ఆపాలి. ఆ దేశంతో సైనిక, భద్రతా సంబంధాలను తెంచుకోవాలి. పాలస్తీనా ప్రయోజనాల కోసం ప్రభుత్వం దృఢంగా నిలబడాలి. మన సంఘీభావాన్ని పునరుద్ఘాటించాలి. రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమన్న మన దీర్ఘకాలిక విదేశాంగ విధాన వైఖరికి కట్టుబడి ఉండాలి.
కీలక రంగాల ప్రయివేటీకరణ
అణు విద్యుదుత్పత్తిని ప్రయివే టీకరించి, విదేశీ అపరేటర్లను అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అమెరికా అణు రియాక్టర్ తయారీ దారులు ప్రవేశించడానికి వెసులుబాటు కల్పిస్తూ భారతీయల భద్రతను పణంగా పెట్టి అణు పరిహార బాధ్యత క్లాజును సవరించేందుకు అంగీకరించారు. యుద్ధ విమానాల ఉత్పత్తిని ప్రయివేటు కార్పొరేషన్లకు అప్పగిస్తున్నారు. రక్షణ, గనుల తవ్వకాలు, అణు విద్యుత్ వంటి కీలక రంగాలను ప్రయివేటీకరించడమంటే మన సార్వభౌమాధికారం, భద్రతలపై దాడి చేయడమే.
కేంద్ర కార్యదర్శివర్గం ఏర్పాటు : సభ్యులుగా ఎమ్ఏ బేబీ, బీవీ రాఘవులు, మురళీధరన్, రాజేంద్రశర్మ, కే హేమలత, విక్రమ్సింగ్, కేఎన్ ఉమేష్