Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రివర్గ విస్తరణకు ఓకే..

మంత్రివర్గ విస్తరణకు ఓకే..

- Advertisement -

– ఆమోదం తెలిపిన అధిష్టానం
– నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణం?
– బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక తరగతికి ప్రాధాన్యం
– కీలక శాఖలను వదులుకోనున్న సీఎం
– మంత్రి పదవిని ఆశిస్తున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌?
– మంత్రుల శాఖల మార్పులు తధ్యం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తెలిపింది. దీంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఆదివారం మధ్యాహ్నం 12.15 నిముషాలకు ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, గవర్నర్‌ కార్యాలయం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదైనా కారణాలతో ఈరోజు మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగకుంటే బుధవారం రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రిపదవులను భర్తీ చేయకపోవడంతో అసమ్మతి పెరిగిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం ముహుర్తం ఖరారు చేసినట్టు సమాచారం. పోటీ ఎక్కువగా ఉన్న జిల్లాలను పక్కనపెట్టి తక్కువగా ఉన్న జిల్లాల నుంచి ముగ్గురు లేదా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. అందులో బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక తరగతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అందులో కూడా ఏ జిల్లాకు ప్రాతినిధ్యం లేదో అక్కడి నుంచి మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యత
ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అందులోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ లాంటి పెద్ద జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వరంగల్‌ నుంచి కొండా సురేఖ, సీతక్కకు ప్రాతినిధ్యం లభించింది. అయితే సీఎంను మినహాయిస్తే మహబూబ్‌నగర్‌ నుంచి ఒకరే మంత్రి ఉండటంతో అక్కడి నుంచి బీసీ సామాజిక తరగతికి చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ పేరు బలంగా వినిపిస్తున్నది. ఆదిలాబాద్‌ నుంచి జీ వివేక్‌ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు వినిపిస్తున్నా… వివేక్‌ వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. నిజామాబాద్‌ జిల్లా నుంచి పీ సుదర్శన్‌రెడ్డి ఖాయంగా కనిపిస్తున్నది. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. ఆయన ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా ఉన్నా…సామాజిక సమీకరణాలు అడ్డంగా ఉన్నాయి. దీనితో ఆయనకు మంత్రి పదవి వరించే అకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జనాభా ప్రాతిపదికగా మాదిగ సామాజిక తరగతికి మరో మంత్రి పదవి కావాలంటూ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్‌, వేముల వీరేశం, కాలే యాదయ్య తదితరులు అధిష్టానాన్నీ, సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా, ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు అదే సామాజికతరగతికి చెందిన వారు ఉండటంతో ఆయనకు నిరాశ తప్పేలా లేదు. సీనియర్‌ నేత జానారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ గెలిచినప్పటికీ సామాజిక సమీకరణాల్లో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరినా, కేసు సుప్రీం కోర్టులో ఉంది. దీనితో ఆయన ఆశలపైనా నీళ్లు పోసినట్టేనని ప్రచారం జరుగుతుంది. గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిధ్యం కల్పించి గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఉపయోగించుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. మంత్రివర్గంలో ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే ఎమ్మెల్యే బాలూ నాయక్‌, ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బెల్లయ్య నాయక్‌ ఎమ్మెల్సీగా లేకపోవడంతో, బాలూ నాయక్‌ ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆమె హోంమంత్రి పదవి కావాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శాఖల మార్పులు
ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల శాఖలను మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. దానితోపాటే తన వద్ద ఉన్న కీలక శాఖలను వదులుకుని ఇతరులకు అప్పగించాలని యోచిస్తున్నారు. హోం, విద్యాశాఖ, మున్సిపల్‌, జీఏడీ, క్రీడలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం తదితర శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగిం చనున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు కూడా మారతాయని ప్రచారం జరుగుతుంది.

మీనాక్షి నటరాజన్‌ ఢిల్లీ ప్రయాణం వాయిదా
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ తన ఢిల్లీ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ సమీక్షల్లో బిజీబిజీగా గడిపిన ఆమె…తన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎంకు వివరించారు. అందులో కీలకమైనది క్యాబినెట్‌ విస్తరణ. ఆలస్యం చేయడంతో అసమ్మతి పెరుగుతుందన్న విషయాన్ని ఆమె చెప్పినట్టు తెలిసింది. సీఎంతో మీనాక్షి నటరాజన్‌ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు చేసినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -