విశ్వంలోని అత్యద్భుతాల్లో మానవ శరీరం ఒకటి. దీనిలో అనుక్షణం కోటానుకోట్ల కార్యకలాపాలు, ఏన్నెన్నో సంక్లిష్టతలతో కూడుకొని ఉన్నవి, సంభవిస్తుంటాయి. హానికారక క్రిముల బారిన పడినప్పుడు, అంటు సోకే అవకాశముంటుదన్నది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు, సోకిన అంటు, అంటు వ్యాధిగా పరిణతి చెందకుండా, మన శరీరంలో ప్రయత్నాలు మొదలౌతాయి. అంటే ఆ క్రిముల సంహారానికి శరీరం సంసిద్ధమౌతుంది.
మనిషి దేహంలో జీర్ణ, శ్వాస, రక్త, మూత్ర, నరాల, తదితర వ్యవస్థలున్నట్లే రోగనిరోధక వ్యవస్థ ఒకటి ఉంటుంది. అది ప్రేరేపితమైనప్పుడు, కొన్ని రకాలైన కణాలు, వాటిని లౌకిక భాషలో ‘పోలీస్ కణాలు’ అంటారు. క్రిమి సంహరణార్థం, ఈ వ్యవస్థ, రక్త ప్రసరణలోనికి విడుదల చేస్తుంది.
శరీరంలో ఎక్కడెక్కడ క్రిములు చేరి, అస్వస్థత కలిగిస్తున్నాయో, ఆయా చోట్లలో ఈ పోలీస్ కణాలు రక్తం ద్వారా చేరవేయబడతాయి. రోగ నిరోధక వ్యవస్థ యంత్రాంగం, ఒక్కొక్క హానిజనక క్రిమిని గుర్తించి, దాని సంహరణార్థం చేపట్టవలసిన వివిధ గతివిధులు, పోలీస్ కణాల తయారీ, శిక్షణ, ఇత్యాది వాటిని అమలుపరచడంలో ప్రావీణ్యత కలిగి ఉంటుంది.
ఈ శక్తి మనుషులందరిలో ఉంటుందా?
సామాన్య పరిస్థితుల్లో ఉంటుంది. కానీ, ఎవరిలో ఎంత ఉంటుందనేది, ఎన్నో కారకాల పైన ఆధారపడి ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా వయసు, హార్మోన్లు, పోషక స్థితి
వయసు: స్వతహాగా నవజాత శిశువులో ఈ శక్తి చాలా అల్పస్థాయిలో ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాములుగా తల్లి నుండి రక్తం ద్వారా పోషకాలతో బాటు, తల్లి ఆరోగ్యస్థితికనుగుణంగా కొన్ని వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధక కణాలు శిశువులో వచ్చి చేరుతాయి. బిడ్డ పుట్టిన తరువాత కూడా వాటి ప్రభావం కొన్ని నెలల వరకు కొనసాగి, కొన్ని అంటువ్యాధుల నుండి శిశువును కాపాడుతూ వస్తాయి. బిడ్డ వయసు పెరుగుతున్నకొద్దీ, రోగనిరోధక వ్యవస్థ క్రమేణా యుక్తవయసు వరకు వృద్ధి పొందుతూ, అప్పటికి సంపూర్ణ పరిపక్వతనేది సంపాదించుకొంటుంది.
అలాగే, వయసు పైబడుతున్న కొద్దీ, రోగ నిరోధక శక్తి క్షిణించవచ్చు. వద్ధ వయసులో సాధారణంగా శరీరం క్షిణించే ప్రక్రియలో, అన్ని వ్యవస్థలతో బాటు రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీన పడుతుంది.
పోషకాహారం: రోగనిరోధక ప్రక్రియ బలవత్తరంగా సాగడానికి శరీరానికి, శరీర వయసు-బరువుకు తగు పాళ్ళలో నిరంతర పోషకాహారం సరఫరా చేయడం ఎంతైనా అవసరం. వయసు పెరుగుతున్నకొద్దీ పోషకాహారాల అవసరాలు ఎన్నో రేట్లు పెరుగుతాయి. వయసుకు తగ్గ మోతాదులో పిండి, క్రొవ్వు పదార్థాలు, మాంసకత్తులు సమపాళ్లలో ఉన్నటువంటి సమతుల్య ఆహారం క్రమబద్ధంగా తీసుకొనే వారిలో రోగనిరోధక శక్తి బలంగా వృద్ధి చెందుతుంది.
దీర్ఘ కాల వ్యాధులు, హార్మోన్లు: అధిక రక్త పోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, కిడ్నీ, కాన్సర్ వంటి దీర్ఘ కాల వ్యాది óగ్రస్తులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అనియంత్రిత డయాబెటిస్, థైరాయిడ్ సంబంధిత జబ్బులతో బాధపడే వారిలో హార్మోన్ల ప్రభావం కూడా తోడౌతుంది కాబట్టి, రోగ నిరోధక శక్తి మరింత మందగిస్తుంది.
రోగనిరోధక శక్తి గర్భిణీ స్త్రీలలో పిండ రక్షణార్థం సహజంగానే తగ్గుతుంది. దీనికి సామజిక-మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం తోడైనప్పుడు ఈ శక్తి మరింతగా క్షీణించి, తల్లి ఆరోగ్యమే కాకుండా బిడ్డ పైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంటుంది.
రోగ నిరోధక యంత్రాంగం ఎలా పని చేస్తుంది?
పైన పేర్కొన్న విధంగా గర్భంలో ఉన్న శిశువుకు తల్లి రక్తం ద్వారావచ్చి చేరే సంరక్షక కణాలు, నవజాత శిశువును కూడా మూడు నుండి ఆరు నెలల వరకు ఎన్నో తీవ్రమైన అంటు వ్యాధుల నుండి రక్షిస్తాయి. తల్లి పాలు తాగే శిశువులైతే సంపూర్ణ రక్షణ పొందుతారు. తల్లి పాలు ఆపే తరుణంలో బిడ్డ తినగలిగే పోషకాహారాన్ని, అంచెలంచెలుగా దైనందిక ఆహారంలో పొందు పరిచినట్లైతే, రోగ నిరోధక యంత్రాంగం ధడ పడుతూ, కౌమార్యం వరకు వృద్ధి చెందుతూ ఉంటుంది.
వీటికి తోడు, డబ్ల్యూ హెచ్ ఓ/ ఐఏపీ సూచనలకనుగుణంగా, వైద్యుల నియంత్రణలో వ్యాధి నిరోధక టీకాలు నియమానుసారంగా తప్పనిసరిగా ఇవ్వవలిసి ఉంటుంది. మాములుగా నవజాత శిశువుకు బీసీజీ, డీపీటీ, పోలియో ఆ యా వ్యాధుల నివారణార్థం ఇవ్వడం పరిపాటి. ఆ తరువాత, నెలవారీగా ఐదు బూస్టర్లు శిశువుకు తొమ్మిదో నెల లోపు తప్పనిసరిగా అందాలి. ఒకటి నుండి ఒకటిన్నర సంవత్సరం లోపు మీసీల్స్, మంప్స్, రుబెల్లా, ఆ తరువాత ఐదేళ్ల వయసప్పుడు డీటి, మరల పదేళ్ళప్పుడు ఇవ్వవలిసి ఉంటుంది.
పైన చెప్పబడినవి ముఖ్యమైనవి, ప్రాథమికమైనవి, తప్పనిసరిగా పిల్లందరికి ఇవ్వవలసిన వాక్సిన్లు.
యుక్త వయసు తరుణానికి, రోగనిరోధక యంత్రాంగం అనగా శరీరంలోని ఎముక మజ్జ (బోన్మారో), శోష రస గ్రంథులు (లింఫ్ నోడ్స్), ప్లీహాము (స్ప్లీన్) లో పోలీస్ కణాలు వృద్ధి చెందుతాయి. ఇదే యంత్రాంగం కొన్ని బహుక్లిష్ఠ ప్రక్రియల ద్వారా వాటికి క్రిములతో పోరాడే శిక్షణ ఇచ్చి, రోగనిరోధకదిశలో సంసిద్ధులుగా చేసి, అవసరానికి మేర రక్తప్రసరణ లోనికి విడుదల చేస్తుంటాయి. ఇది శరీరంలోని అన్ని వ్యవస్థల వలే జీవితాంతము, కొన్ని ఎగుడు దిగుడ్లతో కొనసాగే, శక్తివంతమైన, దైనందిన చర్య. మరి ఇటువంటి వ్యవస్థను, మిగితా అన్నివ్యవస్థల వలే ఆరోగ్య భరితంగా కాపాడుకోవడం మన బాధ్యత కదా!
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ఎలా?
– ‘నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది’ అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.
– ‘వైద్యుల, ఆసుపత్రుల అవసరం తప్పనిసరి పరిస్థితుల్లోనే’ అని మానసికంగా తీర్మానించుకోవాలి.
– రోగ నిరోధక చర్యలు స్థూలంగా, మన దైనందిన చర్యల్లో చేపట్టాలి. దీనిలో మొట్ట మొదట చేయవలసింది జీవన శైలి లో మార్పు.
– రోజువారీ, దీర్ఘకాల, ఈ రెండు రకాల ఒత్తిడిని తగ్గించుకొనే జీవన శైలిని అలవరచు కోవాలి.
– ఆహారపు అలవాట్లు క్రమబద్దీకరణ: వయసు-వత్తికి సరిపడే సమతుల్య, పోషకాహార భరితమైన ఆహారం సకాలంలో తీసుకోవడం, వ్యర్థ-అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండడం.
– వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం.
– గాలి, వెలుతురు పుష్కలంగా ఉండే విధంగా ఇళ్లను ఉంచుకోవడం.
– తాగు నీరు, రోజు మొత్తంలో కనీసం మూడు లీటర్లు, సేవించడం.
– వ్యాయామం, ధ్యానం-యోగాసనాలు, ప్రాణాయామం, ఆహ్లాదప్రదేశాల్లో నడక, విహారం ఇత్యాదివి క్రమం తప్పకుండ దినచర్యలో మిళితం చేసుకోవడం.
– మన రోజువారీ ఆహారంలో శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు అన్నీ ఉండకపోవచ్చు. వాటిని ఆహారంతో బాటు, ఆహార సప్ప్లీమెంట్స్ రూపంగా, అనగా విటమిన్లు- విటమిన్ బి కాంప్లెక్స్, ఏ, డి, కె, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి తీసుకోవాల్సి ఉంటుంది.
– శరీరావసరం మేరకు రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల మంచి నిద్ర తప్పనిసరి.
– తీరిక వేళల్లో బద్దకించక, ఫోన్, టీవీ వాడకానికి నియమిత సమయం కేటాయించి, ఎక్కువ సమయాన్ని కుటుంబంతో/ సాకారాత్మక వ్యక్తులతో పంచుకోవడం / మంచి అభిరుచులను పెంపొందించుకోవడం-ఇత్యాది కార్యక్రమాల్లో మేధస్సును నిమగం చేయడం.
పైన చెప్పిన విధంగా మన జీవన శైలిని మలచుకుంటే, క్రమేణా మనలో సాకారాత్మత పెరిగి, ఆనంద సూచిక
(హ్యాపీనెస్ ఇండెక్స్) ను పెంచుకోగలుగుతాము.
తద్వారా రోగనిరోధక వ్యవస్థ ఒక్కటే కాదు, అన్ని వ్యవస్థలు చక్కబడతాయి.
మరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడదామా?
డాక్టర్ మీరా,
రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,
ఫీవర్ హాస్పిటల్ /ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.