నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు (ఐడీఎఫ్) గాజాపై దాడులు కొనసాగిస్తుండటం, అదే సమయంలో ఇరాన్తో ప్రత్యక్ష ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు, అమీత్ యార్దేనీల వివాహం మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నెతన్యాహు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, ఇటీవల ఇరాన్లోని కొన్ని సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని నెతన్యాహు తన కుమారుడి పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి నెతన్యాహు కుమారుడి వివాహ విషయం చర్చనీయాంశంగా మారింది. గాజాలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, ప్రధాని ఇంట్లో వివాహ వేడుకలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు కూడా పెళ్లి వాయిదా నిర్ణయానికి ఒక కారణంగా ఉండవచ్చని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.