– జనన సమయంలో లింగ నిష్పత్తి దారుణం
– బీహార్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 891 మంది బాలికలు : సీఆర్ఎస్ నివేదిక
న్యూఢిల్లీ: బీహార్లో పిల్లల లింగ నిష్పత్తి అంతరం ఆందోళనను కలిగిస్తున్నది. 2022లో ఈ రాష్ట్రం జనన సమయంలో లింగ నిష్పత్తి (ఎస్ఆర్బీ)ని అత్యంత తక్కువగా నమోదు చేసింది. ఇది ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు గానూ 891 మంది అమ్మాయిలుగా మాత్రమే ఉన్నది. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) నివేదిక ఆధారంగా తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఈ గణాంకాల ప్రకారం.. 2020 నుంచి జనన సమయంలో లింగ నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం కూడా బీహారే కావటం గమనార్హం. 2020లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 964 మంది బాలికలు ఉన్నారు. 2021లో ఈ నిష్పత్తి 908కు పడిపోయింది. 2022 అది కాస్తా 891కి తగ్గింది. లింగ నిష్పత్తి అంతరం భారీగా పెరిగిపోవటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎన్డీఏ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ”ఒకవైపు మహిళలపై నిరంతర లైంగికదాడులు.. మరోవైపు, లింగ నిష్పత్తి పరంగా దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి. బీహార్ డబుల్ ఇంజిన్ సర్కారు మహిళలకు ప్రమాదకరమని రుజువు చేస్తున్నది” అని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారు బేటీ బచావో-బేటీ పడావో, నారీశక్తి వంటి నినాదాలు వినిపిస్తున్నది. ఇటు కాషాయపార్టీ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళల పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంటున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎన్నికలవేళ కీలకాంశంగా..
ఈ ఏడాది చివరలో బీహార్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి మొదలైంది. అధికార బీజేపీ-జేడీయూ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్-ఆర్జేడీ కూటములు మధ్య పరస్పరం విమర్శల దాడులు కొనసాగు తున్నాయి. ఇప్పుడు ఈ లింగ అంతరం భారీగా పెరిగిపోవటమనేది అధికార కూటమిని ఆత్మరక్షణలో పడేసిందని విమర్శకులు చెప్తున్నారు. ఈ అంశం కూడా ఇప్పుడు ప్రతిపక్షానికి ఒక బలమైన ఆయుధాన్నిచ్చినట్టయ్యిందని అంటున్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారాలను రూపొందించటం ప్రారంభించాయి. జార్ఖండ్, మహరాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో మహిళా ఓటర్లను ఆకర్షించటానికి నగదు బదిలీలు, సంక్షేమ హమీలను రాజకీయ పార్టీలు ప్రకటించాయి. బీహార్లోనూ ఇవే వ్యూహాలు కనిపించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, పుట్టుక సమయంలోనే లింగ అంతరం ఇంత భారీ మొత్తంలో ఉంటే.. ఇక రాజకీయ పార్టీలు చెప్పే మహిళా సాధికారత అనే ఊకదంపుడు ఉపన్యాసాలకు అర్థమేముంటుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
దేశంలోనూ ఆందోళనకరమే..!
ఏటికేడు పుట్టుక సమయంలో లింగ నిష్పత్తి విషయంలో బీహార్ దారుణ ప్రదర్శనను కనబరుస్తున్నది. గతంలో ఇదే స్థాయిలో గణాంకాలను నమోదు చేసిన కొన్ని రాష్ట్రాలు మాత్రం మెరుగుదలను సాధించాయి. కానీ, బీహార్ మాత్రం మరింత అట్టడుగుకు పడిపోవటం ఆందోళనకరం. దేశవ్యాప్తంగా ఎస్ఆర్బీ 1000:943గా ఉన్నది. బీహార్తో పోలిస్తే 52 పాయింట్లు మాత్రమే ఎక్కువ. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లవారీగా చూస్తే.. నాగాలాండ్ ఎస్ఆర్బీ విషయంలో చక్కటి ప్రదర్శనను కనబర్చింది. 2022లో ప్రతి వెయ్యి మందికి బాలురకు 1068 బాలికలుగా ఉన్నది. ఆ తర్వాత అరుణాచల్ప్రదేశ్ (1036), లడఖ్ (1027), మేఘాలయ (972), కేరళ (971)లు ఉన్నాయి.
బీహర్లో జననాలు ఎక్కువ.. కానీ ఆడపిల్లలు తక్కువ
బీహార్లో విచిత్రకరమైన పరిస్థితులున్నాయి. ఇక్కడ 2022లో ఎస్ఆర్బీ సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ.. భారత్లో అత్యధిక జననాల సంఖ్యలో బీహార్ మూడో స్థానంలో ఉన్నది. ఇక్కడ 30.70 లక్షలకు పైగా జననాలు నమోదయ్యాయి. ఇందులో 13.10 లక్షల మందికి పైగా మాత్రమే బాలికలుండగా, 14.70 లక్షల మందికి పైగా బాలురున్నారు. అంటే, పురుషులు, స్త్రీల జననాల మధ్య సంపూర్ణ అంతరం 1.60 లక్షల కంటే ఎక్కువగా ఉన్నది. ఇది దేశంలోనే అత్యధికం.
భారత్లో జనన, మరణాలు ఇలా..
ఇక 2022లో భారత్లో 2.54 కోట్ల జననాలు నమోదయ్యాయి. ఇది 2021లో నమోదైన జననాల సంఖ్య 2.42 కోట్లతో పోల్చుకుంటే పెరిగింది. అయితే, దేశంలోనూ లింగ నిష్పత్తి అంతరాలు గణనీయంగానే ఉన్నాయి. జననాలలో 52.4 శాతం మంది అబ్బాయిలు కాగా.. 43.5 శాతం మంది అమ్మాయిలున్నారు. ఈ జననాలు పట్టణ ప్రాంతాలలో 56.5 శాతంగా ఉంటే, గ్రామీణ భారతంలో 43.5 శాతంగా ఉన్నాయి. 2022లో నమోదైన మరణాలు గణనీయంగా తగ్గాయి. 2021లో కోవిడ్-19 మహమ్మారి తీవ్రతను భారత్.. 1.02 కోట్ల మరణాలు నమోదు కాగా.. 2022 నాటికి 80 లక్షలకు పడిపోయాయి.పురుషుల మరణాల (60.4 శాతం) సంఖ్య మహిళల మరణాల (39.6 శాతం) కంటే తక్కువగా ఉన్నాయి. 59.5 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల నుంచి, 40.5 శాతం మరణాలు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నాయి.
భారీ అంతరాలు
- Advertisement -
- Advertisement -