న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఉదర సంబంధమైన సమస్యతో సర్ గంగా రాం ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుం టున్న విషయం తెలిసిందే. ‘సోనియా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితినివైద్యులు నిరంతరం సమీక్షిస్తున్నారు’ అని గంగారాం ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ అజయ్ స్వరూప్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 78 సంవత్సరాల సోనియా ఈ నెల 9వ తేదీన ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తపోటు అధికం కావడంతో దానికి రెండు రోజుల ముందు సిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాలలో కూడా ఆమెకు పరీక్షలు నిర్వహించారు.