నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత 144మంది బాధితులను డిఎన్ఎ నమూనాల ద్వారా గుర్తించామని అధికారులు మంగళవారం వెల్లడించారు. 101 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని అన్నారు. ”మంగళవారం ఉదయం వరకు, 144 డిఎన్ఎ నమూనాలను పరీక్షించారు. 101 మృతదేహాలు ఇప్పటికే కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ 101 మృతదేహాల్లో ఐదు విమాన ప్రయాణికులు, సిబ్బంది కాదు ” అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేస్ జోషి మీడియాకు తెలిపారు. 101 మృతదేహాలు గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ మరియు డయ్యూల్లోని కుటుంబాలకు అప్పగించామని అన్నారు. బాధితులందరి డిఎన్ఎ ప్రొఫైలింగ్ మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
ఐదు రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రభుత్వం మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బాధితులను గుర్తించేందుకు అధికారులు డిఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తున్నారు.