- సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
- యుద్దోన్మాదాన్ని పెంచుతున్న ప్రధాని
- ట్రంప్ మధ్యవర్తిత్వంపై వాస్తవాలు బయటపెట్టాలి
- అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా కేంద్రం చర్యలు
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వానికి ఎమర్జెన్సీకి మించిన ప్రమాదం వచ్చిందని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. మంగళవారం విజయవాడలోని ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలిట్బ్యూరో సభ్యులు యు.వాసుకి, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రజలకు వాస్తవాలు తెలపాలని, ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్నారని, దీనికి ప్రతిగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కాల్పులు మొదలయ్యాయని, దీన్ని తానే విరమింపజేసినట్లు ట్రంప్ ప్రకటన చేశారని, దీనిపై ప్రత్యేక పార్లమెంటు ఏర్పాటు చేసి వాస్తవాలు బయటపెట్టాలని కోరితే కేంద్రం అంగీకరించడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం ఏదో దాస్తోందని, ప్రజలకు అబద్ధాలు చెబుతోందని సిపిఎం అభిప్రాయపడుతోందన్నారు. ఉగ్రవాదులను అణచడానికి, ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి యుద్ధం పరిష్కారం కాదని సిపిఎం చెబుతూ వస్తోందని, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా, సెక్యురిటీని బలపర్చుకోవడం, ప్రజల మద్ధతును కూడగట్టడం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆ పని చేయకుండా మోడీ ఆయన బృందం యుద్దోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని తెలిపారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి దానికి ప్రధాని రాకుండా మంత్రులను పంపించారని, మోడీ ఎందుకు హాజరు కాలేదో ప్రజలకు చెప్పాలన్నారు. అమెరికా విదేశాంగ విధానానికి వీలుగా కేంద్రం వ్యవహరిస్తూ ట్రంప్కు దాసోహం అయిందని విమర్శించారు. ఇటీవల ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేసిందని, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖండిరచడం లేదని పేర్కొన్నారు. ఇరాన్తో మనకు స్నేహపూర్వక ఆర్థిక సంబంధాలున్నాయని, యుద్ధం జరిగితే క్రూడ్ అయిల్ ధరలు పెరిగి మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే క్రూడ్ అయిల్ ధరలు పదిశాతం పెరిగాయని పేర్కొన్నారు. కేంద్రం ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే కనీసం ఖండించే పని కూడా చేయడం లేదని, దీనిపై ప్రకటన చేసిన ట్రంప్ గతంలో పాకిస్తాన్, ఇండియా యుద్దాన్ని తానే ఆపానని చెప్పారని, అయినా కేంద్రం నోరెత్తడం లేదని విమర్శించారు. ప్రపంచదేశాలు ఇజ్రాయిల్పై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్రం ఇజ్రాయిల్కు మద్దతుగా ఉందని, తన వైఖరి మార్చుకోవాలన్నారు. దాడిచేసిన వారిని దాడికి గురవుతున్న వారినీ ఒకేగాటన కట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఈ తీరు అమెరికాకు ఇబ్బంది లేకుండా ట్రంప్కు ఇష్టపూర్వకంగా వ్యవహరించేలా ఉందని, విశ్వగురు అని చెప్పుకుంటూ ట్రంప్కు తొత్తుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్లో ఒడరేవు మనం నిర్మిస్తున్నామని, క్రూడ్ అయిల్ అక్కడ నుండి తెచ్చుకుంటున్నామని, ఈ దశలో ఇజ్రాయిల్ దురాగతాలను ఖండిరచాల్సిందిపోయి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్తో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని ఆయన డిమాండు చేశారు.
ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలి
జూన్ 25 నాటికి ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతాయని, దాని ప్రమాదాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని రాఘవులు తెలిపారు. అప్పట్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సిపిఎం పోరాడిందని వివరించారు. ప్రతిపక్ష పార్టీలూ కలిసి పోరాడాయని, ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యానికి, రాజకీయ వ్యవస్థకు ఎంత హాని జరిగిందో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం అంతకంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆరోజు ప్రజలందరూ కలిసి ఎమర్జెన్సీ నుండి దేశాన్ని ఎలా రక్షించుకున్నారో ఈరోజు నయా ఫాసిస్టు శక్తుల ప్రమాదం నుండి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం నిర్ణయించిందని తెలిపారు. దీనికోసం ప్రజల కర్తవ్యాన్ని, ప్రతిపక్షాలు ఐక్యంగా కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని ప్రజల ముందు ఉంచాలనుకున్నామని తెలిపారు.