నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతో పశ్చిమాసియాలో మృత్యుఘోష మారణోమం జరగుతుంది. రెండు దేశాల ప్రతీకార దాడులతో వేలమంది చనిపోతున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులు చేస్తోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా నెతన్యాహు దాడులకు తెగబడుతున్నారు. అదే విధంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్ ప్రతీదాడులకు దిగి..పలు ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్పై హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. యుద్ధం తీవ్రమవుతుండడంతో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు