నవతెలంగాణ-హైదరాబాద్: జీ7 సమ్మిట్ సందర్భంగా కెనడా-ఇండియా దౌత్య సంబంధాల పరంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా దౌత్యవేతలను తిరిగి నియమించడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇరుదేశాల పౌరులు, వ్యాపారాలకు సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ సమావేశం ముఖ్యమైనదని భావిస్తున్నానని అన్నారు.
నిజ్జర్ హత్యతో దెబ్బతిన్న భారత్-కెనడా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇటీవలే జరిగిన కెనడా ఎన్నికల్లో అధికార మార్పు జరగడం.. ట్రూడో పాలనలో తెగిపోయిన సంబంధాలు ఇప్పుడు మళ్లీ బలపడుతున్నాయి.