Thursday, June 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదుర్భరస్థితిలో సాగర్‌ ఎడమ కాల్వ

దుర్భరస్థితిలో సాగర్‌ ఎడమ కాల్వ

- Advertisement -

– కోతలకు గురవుతున్న కాలువ కట్టలు
– నీరు విడుదల చేస్తే తెగిపోయే ప్రమాదం.. : జూలకంటి
– కాల్వ కట్టలను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ -మిర్యాలగూడ

‘అయ్యా మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గారు.. సాగర్‌ ఎడమ కాలువల దుస్థితిని ఒక్కసారి అధికారులతో కలిసి పరిశీలిం చండి.. కాలువ కట్టలకు లైనింగ్‌ లేక కోతలకు గురవుతున్నాయి.. అనేక చోట్ల బుంగలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి.. ఈ వానాకాలం సీజన్‌లో నీటిని విడుదల చేస్తే కాల్వ కట్టలు తెగి పంట పొలాలతో పాటు అనేక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ‘ఆయకట్టు ప్రాంతానికి చెందిన వారిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న మీరు నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఒక్కసారి కాల్వ కట్టలను పరిశీలించండి..’ అని కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెం బ్రిడ్జి మైల్‌ 41 వద్ద కోతలకు గురవుతున్న కాల్వ కట్టలను బుధవారం సీపీఐ(ఎం) నేతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ సాగర్‌ నుంచి ఖమ్మం జిల్లా పాలేరు వరకు 179 కిలోమీటర్లు విస్తరించి ఉందని తెలిపారు. గతంలో ఎడమ కాల్వ కట్టలకు లైనింగ్‌ ఏర్పాటు చేశారని, అక్కడక్కడా సీసీ లైనింగ్‌ ఏర్పాటు చేయకుండా వదిలేశారని తెలిపారు. ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లలోపు అనేక చోట్ల కాల్వ కట్టలు బలహీనంగా ఉండి కోతకు గురవుతున్నాయని అన్నారు. కాల్వ కట్టలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలం రాబోతుందని ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తే కాలువ కట్టలు పూర్తిగా తెగే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల పంట పొలాలతో పాటు అనేక గ్రామాలు నీటిలో మునుగుతాయని తెలిపారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలవ కింద కిష్టాపురం, వజిరాబాద్‌, ముది మాణిక్యం, ములకల కాల్వ, జాన్‌పాడ్‌, మేజర్లు ఉన్నాయని, అవి ఎన్నో ఏండ్లుగా మరుమ్మతులకు నోచుకోవడం లేదన్నారు.
ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులతో మిర్యాలగూడలో సమావేశం జరిపిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాల్వకట్టల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ కాల్వల మరమ్మతులకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని, కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని అన్నారు.
సాగునీరు విడుదల చేసేందుకు మరో నెల 15 రోజులు గడువు ఉందని, ఆ లోపు కాలువ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్‌, రైతు సంఘం జిల్లా నాయకులు పాదూరీ శశిధర్‌ రెడ్డి, జిల్లా నాయకులు డా.మల్లు గౌతమ్‌ రెడ్డి, నాయకులు బొగ్గరపు కృష్ణయ్య, రేమిడాల బిక్షం, వలమల్ల ఎల్లయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -