– సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ సుగుణ మరణం వామపక్ష పార్టీల ఉద్యమాలకు తీరనిలోటని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేసింది. కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్లో గురువారం సుగుణమ్మ భౌతికకాయాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టిచాకిరి విముక్తి కోసం మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి తదితరుల నాయకత్వంలో జరిగిన పోరాటంలో సుగుణ ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆమె తన తుది శ్వాస వరకు కమ్యూనిస్టు భావాలకు కట్టుబడుతూ, మహిళా ఉద్యమాల్లో చురుకుగా పనిచేసారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
