Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయంబనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ను అడ్డుకోండి..

బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ను అడ్డుకోండి..

- Advertisement -

– తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతిపాదనలు
– చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
– కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
– గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి ఎన్వోసీ ఇవ్వండి
– పెండింగ్‌ ప్రాజెక్టుల సంగతి చూడండి : కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ) ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ (సాధ్యాసాధ్యాల నివేదిక)ను తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌-1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం-2014కు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తుందని ఫిర్యాదు చేశారు. గురువారంనాడిక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, జీడబ్ల్యూడీటీ-1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ), జలశక్తి మంత్రి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉండే ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ విషయంలో ఏపీ సర్కార్‌ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తుందన్నారు. ఈ విషయంలో కేంద్రం, జలశక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్‌ ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు.
బనకచర్లకు బదులు…
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్‌ స్కీంలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. జీడబ్ల్యూడీటీ-1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందనీ, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతున్నదనీ, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారని ఫిర్యాదు చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దష్టి సారించాలని కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తే, పోలవరం-బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర మంత్రికి తేల్చిచెప్పారు.
అనుమతులివ్వండి
తెలంగాణకు గోదావరి నదిలో వెయ్యి టీఎంసీలు, కష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ 1,500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఏపీ సర్కార్‌ చేపడుతోన్న ప్రాజెక్టుల అనుమతి ప్రక్రియలో వేగంగా వ్యవహరిస్తోన్న కేంద్రం, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. దీనవల్ల ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బనకచర్లకు డీపీఆర్‌ తమకు అందలేదని కేంద్ర మంత్రి తెలిపారనీ, త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో కలిసి ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్‌ దాస్‌, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్‌, రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉత్పల్‌ తదితరులు పాల్గొన్నారు.
మెట్రో ఫేజ్‌-2 అనుమతులివ్వండి
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అభివద్ధి, విస్తరణ, ఇతర మౌలిక అంశాలపై చర్చించారు. మెట్రో రైల్‌ అవసరాన్ని వివరించారు.
తెలంగాణ రైజింగ్‌- 2047 విజన్‌ అద్భుతం ప్రభుత్వానికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు
భాగస్వామ్య ఒప్పందాలు ఖరారు
‘ తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 1997-2007 మధ్య పదేండ్ల పాటు యూకేకు ప్రధానిగా, సుదీర్ఘకాలం ఇంగ్లాడ్‌ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్‌ రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్‌, వ్యూహరచన,వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ చేంజ్‌ (టీబీఐజీసీ)ను స్థాపించారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో గురువారం నాడిక్కడ సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటిలో తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వారి అభివద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఈ డాక్యుమెంట్‌ రూపొందించామని సీఎం తెలిపారు. మానవ అభివద్ధి సూచికల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామనీ, పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికల్ని సీఎం ఆయనకు వివరించారు. తెలంగాణ రైజింగ్‌-2047 ముఖ్యాంశాలను 2025, డిసెంబర్‌ 9న రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ఈ ప్రణాళిక సుస్థిరాభివద్ధి దిశగా ఉందని టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్శిటీ వంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్‌ ఆసక్తి చూపారు. ఇరు నేతల భేటి అనంతరం తెలంగాణ రైజింగ్‌ విజన్‌ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, టీబీఐజీసీ ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని (లేటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) పరస్పరం మార్చుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, ఎస్సార్‌ ఏ.పి.జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్‌ రంజన్‌, పారిశ్రామిక, వాణిజ్య విభాగం స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్దన్‌ రెడ్డి, టీబీఐజీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

నేడుఖర్గేతో సీఎం భేటి!
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం పార్టీ అగ్రనేతలతో భేటి కానున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. ఈ భేటిలో తాజా మంత్రి వర్గ విస్తరణ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నెలాఖర్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇతర నేతలను కలుస్తారు. సాయంత్రం హైదరాబాద్‌ వెళ్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -