– ఆదాయాన్ని అందించని స్వయం ఉపాధి
– పెరుగుతున్న రుణ భారం
న్యూఢిల్లీ: దేశంలో స్వయం ఉపాధి పొందుతున్న వారిలో 70 శాతం మందికి పైగా నెలకు కనీసం పాతిక వేల రూపాయల ఆదాయాన్ని కూడా పొందలేకపోతున్నారు. కొద్దిపాటి మొత్తాలను రుణంగా తీసుకొని వ్యాపారాలు ప్రారంభించిన వారు వాటిని తీర్చలేక అష్టకష్టాలు పడుతున్నారని థింక్360.ఏఐ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లు ఉపయోగించుకుంటున్న ఈ సంస్థ రుణ నిర్ణయాలు తీసుకోవడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాయపడుతోంది. మ్యూచువల్ ఫండ్ బదిలీ సంస్థగా పనిచేస్తున్న కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (సీఏఎంఎస్)కు ఇది అనుబంధంగా ఉంటోంది. ఈ సంస్థ గత సంవత్సర కాలంగా ఇరవై వేల మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్లను నిర్ధారించే పనిలో ఉంది. నెలకు పాతిక వేల రూపాయల కంటే తక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి ద్వారా అంతకంటే తక్కువ ఆదాయం పొందుతున్న వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యయనం చెబుతోంది. గత సంవత్సర కాలంలో రుణ వాయిదాలలో కనీసం ఒక్క ఇఎంఐని కట్టలేకపోయిన ఉద్యోగులు 76 శాతం మంది ఉండగా స్వయం ఉపాధి పొందుతున్న వారిలో 64 శాతం మంది ఒక్క ఈఎంఐని చెల్లించలేకపోయారు. ఆదాయం తక్కువగా ఉండడం, అనేక చోట్ల కొద్ది మొత్తంలో అప్పులు తీసుకోవడం, జీవిత ప్రాధాన్యతలు ఈ పరిస్థితికి కారణమని సంస్థ సీఈఓ అమిత్ దాస్ చెప్పారు. నెలకు పాతిక వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న వారు మాత్రం చాలా వరకూ రుణాలను సకాలంలో చెల్లించగలుగుతున్నారని ఆయన తెలిపారు.
చిన్న చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ప్రజలకు ఆర్థిక సంబంధమైన పరిజ్ఞానం తక్కువగా ఉంటోంది. దీంతో వారు ప్రైవేటు వ్యక్తుల నుండి రుణాలు తీసుకుంటూ ఆ సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. అదే నగరాలలో ఆ పరిస్థితి లేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి వారు తేలికగా రుణాలు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా పాతిక వేల రూపాయల కంటే తక్కువ నెలసరి ఆదాయం పొందుతున్న వారి కంటే అంతే ఆదాయం పొందుతున్న ఉద్యోగులపై రుణ సంబంధమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని ఈ సంస్థ తెలిపింది. కాగా మరో అధ్యయనం ప్రకారం నగరాలలో ఉండే ఉద్యోగులు తమ నెలసరి ఆదాయంలో మూడో వంతును ఈఎంఐ చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారు.
నెలకు రూ. 25 వేలు దాటట్లేే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES