నవతెలంగాణ-హైదరాబాద్: డమాస్కస్లోని మార్ ఎలియాస్ క్రిస్టియన్ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది పౌరులు మృతి చెందారు. 52 మంది గాయాలపాలయ్యారని సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో చర్చికి ప్రార్థనల కోసం వచ్చిన వారిలో 20 మంది మృతి చెందారు. డజన్ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.

ఈ ఘటనను సిరియా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో మృతులకు సిరియా అంతర్గత మంత్రి అనాస్ ఖత్తాబ్ సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉగ్రవాద చర్యల వల్ల సిరియాలో అశాంతిని నెలకొల్పలేవు. సిరియా భద్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు ఐక్యంగా నిలబడతారు అని ఆయన అన్నారు. ప్రత్యేక బృందాలు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఆయన ఎక్స్ పోస్టులో వెల్లడించారు.