నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలోని ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రగిలి పోతుంది. ఈక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని అన్నారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన దాడులు లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు నేపథ్యంలో.. అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. 3 అణుకేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది.
ఇరాన్ పై రోజురోజుకు దాడులను ఇజ్రాయిల్ ఉధృతం చేస్తోంది. కెర్మాన్షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ఇజ్రాయిల్ వాయుసేనలు ధ్వంసం చేశాయి. పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను ఈ దాడుల్లో విజయవంతంగా ధ్వంసం చేశామని పేర్కొంది.
మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులతో ఇజ్రాయిల్ సేనలను నిలువరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ డ్రోన్ను ఖోరామాబాద్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసింది. ఇరాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించగా.. ఐడీఎఫ్ కూడా ధ్రువీకరించింది. అది హెర్మ్స్ రకం డ్రోన్ అని ఇరాన్ మీడియా తెలిపింది.