బిఎఫ్ఐ ప్రెసిడెంట్ అజయ్ సింగ్
న్యూఢిల్లీ : గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు పది పతకాలు సాధించటంపై బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఆసియా క్రీడల్లోనూ భారత బాక్సర్లు ఇదే పతక ప్రదర్శన పునరావృతం చేస్తారనే విశ్వాసం ఆయన వెలిబుచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో మన బాక్సర్లు ఏడు బంగారు పతకాలు, మూడు రజత పతకాలతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ‘గత రెండు రోజులు భారత బాక్సింగ్కు చరిత్రాత్మకం. గత 100 ఏండ్లలో కామన్వెల్త్ గేమ్స్లో ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించటం అతిపెద్ద విజయం. ఆసియా క్రీడలతోపాటు 2028 ఒలింపిక్స్కు ఇది సన్నద్ధత. ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పతక ప్రదర్శన పునరావృతం చేస్తాం. ఆసియా బాక్సింగ్లో భారత్ టాప్-3లో ఉంది. అగ్రస్థానంలోకి చేరుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో పతక పోరుకు చేరుకున్న బాక్సర్లు ఆసియా క్రీడలకు నేరుగా అర్హత సాధిస్తారని ఇదివరకే ప్రకటించాం. ఆసియా క్రీడల్లో బలమైన ప్రదర్శన కనబరిచేందుకు కొన్ని వెయిట్ విభాగాల్లో బలోపేతం కావాలి. అందుకు ఎంతో పని చేయాల్సి ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రక ప్రదర్శన అందులో ఒక అడుగు మాత్రమే. మాది అథ్లెట్ కేంద్రిక క్రీడా సమాఖ్య. 2028 వరకు బాక్సింగ్ రోడ్మ్యాప్ సిద్ధంగా ఉంది. దేశవాళీ సర్కిల్లో లీగ్ ఫార్మాట్, ప్రొఫెషనల్ ఫార్మాట్ను పున ప్రారంభించాలనే ఆలోచన ఉందని’ అజయ్ సింగ్ తెలిపారు. భారత బాక్సర్లతో కలిసి అజయ్ సింగ్ ఆదివారం గ్లాస్గో నుంచి మీడియాతో మాట్లాడారు. కామన్వెల్త్ క్రీడలు ఆదివారంతో ముగియగా.. ముగింపు వేడుకలు అర్థరాత్రి 1.30 తర్వాత ఆరంభం అవుతాయి.
ఆసియాలో పునరావృతం చేస్తాం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



