నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి కి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు ఐదు రోజులపాటు ఎన్ఐఏ రిమాండ్కు అప్పగించింది. నిందితులు పర్వేజ్ అహ్మద్ , బషీర్ అహ్మద్ లను ఎన్ఐఏ అధికారులు ఇవాళ జమ్ము కోర్టులో హాజరుపర్చగా.. అదనపు న్యాయమూర్తి, సెషన్ జడ్జిలు ఐదురోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో నలుగురు ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. మహిళలను, చిన్నారులను వదిలేసి పురుష పర్యాటకులు ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు.
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం దర్యాప్తు అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ఉగ్రవాదులకు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఇవాళ జమ్ముకోర్టులో హాజరపర్చగా ఐదురోజులపాటు ఎన్ఐఏ రిమాండ్కు అప్పగించారు.