– అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించండి
– హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచానికే నష్టం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-వైరాటౌన్
సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్పై దాడులకు పాల్పడుతున్నదనీ, అమెరికా దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, పశ్చిమాసియా దేశాలను అస్థిర పరుస్తాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ యుద్ధాల వల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా వైరాలో జరుగుతున్న సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులను తమ్మినేని వీరభద్రం ప్రారంభించి మాట్లాడారు. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తుందన్న దానికి ఎలాంటి ఆధారమూ లేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు తెలిపినా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా ఇజ్రాయిల్ సహాయంతో ఇరాన్పై దాడులు చేస్తోందని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు దౌత్య ప్రక్రియపై గౌరవం లేదనీ, దక్షిణాసియా ప్రాంతంపై యుద్ధాన్ని రుద్దాలని చూస్తున్నాయని అన్నారు. అమెరికా దుశ్చర్యను రష్యా, చైనా, క్యూబా, వెనిజులా ఖండించినా మన దేశ ప్రధాని మోడీ స్పందించకపోవడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధి మూసివేత నిర్ణయం ప్రపంచ దేశాలకు నష్టం చేస్తుందని, భారతదేశానికీ తీవ్ర నష్టం కలుగుతుందని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడుల పట్ల తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధంపై కేంద్రం వైఖరి ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES