Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంఈ ప్రశ్నలకు బదులేది?

ఈ ప్రశ్నలకు బదులేది?

- Advertisement -

– జస్టిస్‌ వర్మపై సుప్రీం కమిటీ నివేదికలో లభించని సమాచారం
న్యూఢిల్లీ:
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అభిశంసించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కమిటీ తన నివేదికలో కొన్ని అంశాల జోలికి పోకపోవడం గమనార్హం. అసలు అగ్ని ప్రమాదం ఎలా మొదలైంది? వర్మ నివాసంలో ఎంత సొమ్ము దొరికింది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు ఎక్కడ ఉంది? వంటి కీలకమైన, ప్రాథమిక ప్రశ్నలకు కమిటీ తన నివేదికలో సమాధానం ఇవ్వలేదు. అవి ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వర్మ బంగళాలోని సామగ్రి గదిలో కాలిపోయిన ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయని కమిటీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళానికి చెందిన పది మంది సాక్షుల వాంగ్మూలాలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చింది. ఆ డబ్బు తనది కాదని, ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉన్నదని వర్మ నిరూపించలేకపోయినందున సొమ్ముకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఆ సొమ్ము వర్మ నివాసంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో కమిటీ తేల్చలేదు. గదిలో పెద్ద మొత్తంలో నగదు లభించిందని కమిటీ తెలిపినప్పటికీ దానిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు మెమోను తయారు చేయలేదు. ఘటనా స్థలంలో పోలీసులు పంచనామా కూడా నిర్వహించలేదు. అయితే ఈ లోపాలకు పోలీసులను కమిటీ బాధ్యులను చేయలేదు. ఏదేమైనా నగదును స్వాధీనం చేసుకోకపోవడం, లెక్కించడం జరగకపోవడంతో అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదు. నగదును గది నుంచి తరలించినట్టు ఆధారాలేవీ లేవు. అందుకు సాక్షులు కూడా ఎవరూ లేరు. వీడియో తీసిన వారు లేరు.
వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం ఎలా మొదలైందనే ప్రశ్నకు కూడా సమాధానం దొరకడం లేదు. నివేదికలో దీని ప్రస్తావనే లేదు. డబ్బు దొరికిన తర్వాత జరిగిన ఘటనలే నివేదికలో ఉన్నాయి. కానీ ప్రమాదం జరగడానికి గంట లేదా రెండు గంటల ముందు ఏం జరిగింది? తన నివాసంలో ప్రమాదం జరిగిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ తెలియజేశారని వర్మ చెబుతున్నారు. జస్టిస్‌ ఉపాధ్యాయకు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరా ఫోన్‌లో ప్రమాదం గురించి సమాచారం అందించారు. సుప్రీం కమిటీ పోలీస్‌ కమిషనర్‌ను విచారించింది కానీ ఆయన ఉపాధ్యాయకు ఏం చెప్పారో నివేదికలో పొందు పరచలేదు. జస్టిస్‌ ఉపాధ్యాయను కమిటీ విచారిం చలేదు. గదిలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్టు తాను చెప్పలేనని ఢిల్లీ ఫైర్‌ సర్వీసుల స్టేషన్‌ ఆఫీసర్‌ మనోజ్‌ మేహ్లావత్‌ కమిటీకి తెలియజేశారు. గదిలో ఎలక్ట్రిక్‌ హీటర్‌ ఏదీ కన్పించలేదని ఆయన చెప్పారు. అసలు ప్రమాదం గురించి పోలీసులకు వర్మ ఫిర్యాదే చేయలేదు. వర్మ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ఫుటేజీలు కూడా ప్రమాద కారణాన్ని తెలియజేయలేకపోయాయి. జస్టిస్‌ వర్మ, ఆయన సిబ్బంది నుంచి, సంఘటనా స్థలంలో ఉన్న అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపారని చెప్పిన కమిటీ…ఆ సంభాషణల వివరాలను నివేదికలో తెలియజేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -