– నామినేటేడ్ పదవులను వెంటనే భర్తీ చేయండి
– పార్టీపై మంత్రులు దృష్టి సారించాలి
– ధర్నాలు చేస్తే మంత్రి పదవులు రావు
– ‘జూబ్లీహిల్స్’కు అభ్యర్థిని అధిష్టానమే ప్రకటిస్తుంది
– కష్టపడితేనే పదవులు…మరో పదేండ్లు అధికారం మనదే
– ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల్లా పని చేస్తున్నాయి : టీపీసీసీ నూతన కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల్లో నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మంత్రులు దృష్టి సారించాలని సూచించారు. పార్టీ బలంగా ఉంటేనే తిరిగి అధికారంలోకి వస్తామని తెలిపారు. కష్టపడిన వారికి పదవులు తప్పకుండా వస్తాయనీ, పని చేయకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పారు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటేనే పార్టీ బలోపేతమవు తుందని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక కోసం పార్టీ అధిష్టానమే అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు. ‘ఎవరైనా తానే అభ్యర్థిని అనుకుంటే అది మీ ఇష్టమే’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ సలహా కమిటీ సమావేశాల్లో సీఎం దిశానిర్దేేశం చేశారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆలస్యం చేయెద్దనీ, వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయాలని మంత్రులను కోరారు. నిధుల బాధ్యతలు కూడా మంత్రుల దగ్గరే ఉన్నట్టు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం గెలిచేలా ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలపై ఇన్చార్జి మంత్రులు సరిగ్గా దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఇక నుంచి జిల్లాలపై ఫోకస్ ఉండాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండు గ్రూపులుగా విభజించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ముందు అందరికీ పని అప్పగించాలనీ, దీని ఆధారంగా పని చేసే వాళ్లను ఒక జాబితాలో పని చేయని వాళ్లని మరో జాబితాలో చేర్చాలని సూచించారు. పని చేస్తే ప్రమోషన్..లేదంటే డిమోషన్ ఉంటుందని గుర్తు చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
తమ ప్రభుత్వ పరిపాలనలో రైతులకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. కులగణన చేసి మోడీకి సవాల్ విసిరామనీ, కేంద్రం మెడలు వంచి కులగణనకు ఓకే చెప్పించామని తెలిపారు. కష్టపడ్డ నేతలకు పార్టీ పదవులు ఇస్తున్నదనటానికి మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనమని అన్నారు. పార్టీని భుజాన మోసిన వారికే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలనీ, పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నూతన కార్యవర్గ సభ్యులు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎంతోమంది పదవుల కోసం పోటీపడ్డారని అన్నారు. సమావేశంలో ఉన్న చాలా మంది నేతలు కిందిస్థాయి నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తన ఎదుగుదల సాధ్యమైందని తెలిపారు.
జూబ్లీహిల్స్లో గెలవాలి : మీనాక్షి నటరాజన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉప ఎన్నికపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందేనని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందర్నీ సమన్వయం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎవర్ని నియమిస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు..ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని సీఎం రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించారు. పార్టీ నిర్ణయించి అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరూ కామెంట్స్ చేయొద్దని సూచించారు. క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరిం చారు. ఈ సందర్భంగా తమ సేవలను ఉపయోగించుకోవాలని పలువురు సీనియర్లు తెలిపారు. అయితే పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ధర్నాలపై సీఎం రేవంత్ సీరియస్
మంత్రి పదవుల కోసం గాంధీ భవన్లో ధర్నాలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. మరోసారి ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా పనులుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అంతేకానీ ధర్నాలు, గొడవలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాయకుల అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకునేందుకు పీసీసీ అధ్యక్షులు ఉన్నారనీ, లేదంటే సీఎంగా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తమకు ఏదైనా సమస్య గురించి చెబితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ధర్నాలతో ఎలాంటి లాభం లేదన్నారు.