Wednesday, June 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోలవరం పాపం బీజేపీదే..!

పోలవరం పాపం బీజేపీదే..!

- Advertisement -

బ్యాక్‌ వాటర్‌ సమస్యకు పరిష్కారం చూపాలి
ఐదు పంచాయతీలతోనే భద్రాచలం అభివృద్ధి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌
నవతెలంగాణ-భద్రాచలం

ఓట్ల కోసం అనునిత్యం రామ నామ జపం చేసే బీజేపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి నిధులను విడుదల చేస్తూ, శ్రీరాముని గుడిని, భద్రాచలం పట్టణాన్ని గోదావరిలో ముంచే పాపానికి ఒడిగడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌ ఆరోపించారు. మంగళవారం సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారం చేపట్టాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్షాలపై సీఐడీ, ఈడీ తదితర సంస్థలను ప్రయోగించి బెదిరిస్తున్నదని తెలిపారు. ప్రశ్నించిన వారిపై అర్బన్‌ మావోయిస్టుల పేరుతో జైలుకు తరలిస్తున్నారని ఆరోపించారు. అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ఘర్షణలను పెంచుతూ అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్త్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి భద్రాచలం ప్రాంతానికి తీవ్ర నష్టం చేసిందని తెలిపారు. పోలవరం పూర్తయితే బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు తప్పదని ఇంజనీర్ల బృందం స్పష్టం చేసినప్పటికీ నివారణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. భద్రాచలం అభివృద్ధికి ముడిపడి ఉన్న ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపడానికి కూడా ఆసక్తి చూపటం లేదని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని స్పష్టంచేశారు. పోలవరంతో భద్రాచలానికి వచ్చే ముంపుపై సీపీఐ(ఎం) 2005 నుంచి ఉద్యమాన్ని ప్రారంభించిందనీ, ఆ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని జైలు జీవితాన్ని సైతం పార్టీ కార్యకర్తలు అనుభవించా రని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి పోలవరం ముంపుపై నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రారంభించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీలైనంత త్వరగా చర్చించుకొని ఐదు పంచాయతీల సమస్యను కూడా పరిష్కరించాలని అన్నారు. భద్రాచలం పట్టణ సమస్యలపై పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో అధ్యయనం చేసి పరిష్కారానికి దశల వారీ పోరాటాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్‌, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట్రామారావు, పారిల్లి సంతోష్‌ కుమార్‌, డి.సీతాలక్ష్మి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -