నవతెలంగాణ సిమ్లా: ఆకస్మిక వరదలు హిమాచల్ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. కుల్లూలో బియాస్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికి ఇద్దరు మృతిచెందారు. ఇందిరా ప్రియదర్శిని జలవిద్యుత్తు ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భారీవర్షాల కారణంగా ప్రాజెక్టు పనిని నిలిపివేశారు.
వరద ప్రవాహ వేగంతోపాటు బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. మనాలీ – చండీగఢ్ జాతీయ రహదారి బియాస్ నది ప్రవాహంతో పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్డివిజనులో ఓ వంతెన కొట్టుకుపోయింది. కాంగ్డా జిల్లాలోని పాలంపుర్లో మంగళవారం సాయంత్రం నుంచి 145.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దాదాపు ఏడు జిల్లాల్లో జూన్ 29 దాకా భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ కార్యాలయం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.