నవతెలంగాణ-హైదరాబాద్ : జూన్ 5న దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే, అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వివాదం నెలకొంది. తన అంత్యక్రియలకు ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా హాజరు కాకూడదని లుంగూ గతంలో స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్న ఆయన కుటుంబ సభ్యులు.. వీటిని దక్షిణాఫ్రికాలో చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జోహన్నెస్బర్గ్లోని ఓ ప్రైవేటు శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు. లుంగూకు చెందిన పార్టీ నేతలు కూడా ఇక్కడకు చేరుకున్నారు.
గంట ముందే..
అయితే, లుంగూ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని, ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా సారథ్యంలోనే ఇవి కొనసాగుతాయని జాంబియా ప్రభుత్వం చెబుతోంది. తాజాగా జూన్ 25న అంత్యక్రియల కార్యక్రమం మొదలయ్యే గంట ముందు.. వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు జాంబియా చట్ట ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సి ఉందని తెలిపింది. గతంలో చనిపోయిన అధ్యక్షులను ఖననం చేసిన శ్మశానవాటికలోనే లుంగూ కోసం సమాధిని సిద్ధం చేశామని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే, ఆలోపే ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అక్కడి రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.