నవతెలంగాణ – హైదరాబాద్: ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కుండపోత వర్షాలను కురిపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి అనుబంధంగా ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా.. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాలకు అనూహ్యమైన స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరువ కావడంతో, ఇంజనీర్లు వెంటనే అప్రమత్తమై నీటి మట్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందులో భాగంగా.. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం గేట్లలో 12 గేట్లను ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు, శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు. అయితే.. ఈ ప్రక్రియలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు గేట్లను పైకి లేపుతున్న సమయంలో.. 9వ నెంబర్ గేటుకు సంబంధించిన బలమైన ఉక్కు మోకులు ఒక్కసారిగా తెగిపోయాయి. ఈ పరిణామంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు, 12వ, 16వ నెంబర్ గేట్లు కూడా అత్యంత బలహీనంగా, ప్రమాదకర స్థితిలో ఉన్నాయని సమాచారం. ఈ వార్త క్షణాల్లో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు, ఆయకట్టు గ్రామాలకు పాకిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.