నవతెలంగాణ-హైదరాబాద్: యోగి ప్రభుత్వ పాలనలో యూపీలో గూండాయిజం పెరిగిపోయింది. విద్యుత్కోతపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అపార్ట్మెంట్ వాసులను మెయింటినెన్స్ సిబ్బంది కర్రలతో చావగొట్టారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నొయిడాలోని ఎకోవిలేజ్ -1 సొసైటీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. హౌసింగ్ కాంప్లెక్స్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆందోళనకు గురైన అపార్ట్మెంట్వాసులు మెయింటినెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. సిబ్బంది స్పందించకపోవడంతో, సమాధానమివ్వాలని వారిని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ వెంటనే, మెయింటినెన్స్ సిబ్బంది, కొంతమంది సెక్యూరిటీ గార్డులు ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు కర్రలతో చావగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
సుమారు నాలుగు గంటలుగా విద్యుత్ నిలిచిపోయిందని, మెయింటెనెన్స్ సిబ్బందికి ఫోన్చేసినా పట్టించుకోలేదని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు. వారికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లేసరికి.. అప్పటికే అక్కడ కొందరు నివాసితులు వారితో మాట్లాడుతున్నారని అన్నారు. ఉన్నట్లుగా మెయింటెనెన్స్ సిబ్బంది మాపై కర్రలతో విరుచుకుపడ్డారని, తన కాలర్ పట్టుకుని, చెంప దెబ్బ కొట్టారని అన్నారు. ఈఘటనతో భయాందోళనకు గురైన పిల్లలు ఏడుస్తూ ఉన్నారని అన్నారు. అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశామని సెంట్రల్ నొయిడా డిసిపి తెలిపారు.