నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.
కేంద్రం కల్పించిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారిలో ఒకరైన దేవ్ ముచాకి అలియాస్ ప్రమీల (21)పై రూ.8లక్షల రివార్డు ఉంది. ఇక ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని ఏరియా కమిటీ సభ్యుడైన కోసా ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేష్ అలియాస్ మహేష్ సాగర్ అలియాస్ రమేష్ (29)పై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరో మావోయిస్టు కోసి పోడియం (27) తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. సమ్మి సెమ్లా (23), ఛోటూ పార్సిక్ అలియాస్ దీపక్ (25), మోతీ తాటి (24), సునీత హేమ్లా (24), మంజుల కుంజమ్ (27), సైబో పొడియం (18), హంగీ ఉండుమ్ అలియాస్ రాధ (21) తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.