నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా ప్రతి నెల 1వ తేదీనే ఠంఛనుగా జీతాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ.. ఆర్థిక శాఖ ఈ నెల నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగింది. ఈ నేపథ్యంలోనే వారి అకౌంట్లలో జూలై 1వ తేదీనే జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతంలో జీతాలు ఆలస్యంగా రావడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



