– వ్యవసాయ రంగంపై ఎన్ఎస్ఓ నివేదిక విడుదల
– 2011-12 నాటికి 62.4 శాతం
– 2023-24లో 54.1 శాతానికి పడిపోయిన వైనం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని మోడీ పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ.. తన 11 ఏండ్ల పాలనలో తన హామీని మాత్రం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏ పాలనలో దేశంలో వ్యవసాయం రంగం వృద్ధి తగ్గుదలను నమోదు చేసింది. సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2011-12లో 62.4 శాతంగా ఉన్న వృద్ధి 2023-24 నాటికి 54.1 శాతానికి పడిపోయింది. వ్యవసాయ, అనుబంధ రంగాలపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ) సుమారు 225 శాతం పెరిగింది. 2011-12లో రూ.1,502 వేల కోట్ల నుంచి 2023-24లో రూ.4,878 వేల కోట్లకు చేరిందని పేర్కొన్నది. స్థిర ధరల వద్ద, ఈ రంగాల నుంచి ఉత్పత్తి స్థూల విలువ (జీవీఓ) 2011-12లో రూ.1,908 వేల కోట్ల నుంచి 2023-24లో రూ.2,949 వేల కోట్లకు స్థిరంగా పెరిగిందనీ, ఇది ఈ కాలంలో 54.6 శాతం పెరుగుదలను నమోదు చేసుకున్నదని వివరించింది.
ఆ ఐదు రాష్ట్రాల వాటా 53 శాతం
జీవీఓలో పంట రంగం సింహ భాగాన్ని కలిగి ఉన్నది. ఇది రూ.1,595 వేల కోట్ల వాటాను అందిస్తోందనీ, ఇది స్థిర ధరల వద్ద మొత్తం జీవీఓలో అతిపెద్ద భాగంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఇది 2023-24లో 54.1 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రంగంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు కలిసి పంట జీవీఓలో 52.5 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. తృణధాన్యాలలో వరి, గోధుమలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. 2023-24లో తృణధాన్యాలు జీవీఓలో దాదాపు 85 శాతం ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, హర్యానా ఐదు రాష్ట్రాలు తృణధాన్యాల జీవీఓలో దాదాపు 53 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ 2011-12లో 18.6 శాతం నుంచి 2023-24లో 17.2 శాతానికి తగ్గుదలను చూసింది.
మామిడిని అధిగమించిన అరటి
పండ్ల విభాగంలో 2023-24లో మామిడిని అధిగమించి అరటి రూ.47 వేల కోట్ల జీవీఓను నమోదు చేసుకుంది. మామిడి రూ.46.1 వేల కోట్లుగా ఉన్నది. 2011-12 నుంచి 2021-22 వరకు మామిడి పండ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది.
పశువుల రంగంలో తగ్గిన పాల వాటా
పశువుల రంగం అధిక వృద్ధిని నమోదు చేసుకుంది. దాని జీవీఓ 2011-12లో రూ.488 వేల కోట్ల నుంచి 2023-24లో రూ.919 వేల కోట్లకు పెరిగింది. పాలు ప్రధాన భాగంగా ఉన్నది. అయితే ఈ కాలంలో దాని వాటా 67.2 శాతం నుంచి 65.9 శాతానికి కొద్దిగా తగ్గింది.
మత్స్య సంపదలో ఏపీ, పశ్చిమ బెంగాల్లు ముందు
అటవీ, లాగింగ్ రంగం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. దాని జీవీఓ 2011-12లో రూ.149 వేల కోట్ల నుంచి 2023-24లో రూ.227 వేల కోట్లకు పెరిగింది. అదే కాలంలో ఈ రంగంలో పారిశ్రామిక కలప వాటా 49.9 శాతం నుంచి 70.2 శాతానికి పెరిగింది. ఫిషింగ్, ఆక్వాక ల్చర్ ఉపరంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏపీ, పశ్చిమ బెంగాల్ మత్స్య సంపద జీవీఓకి కీలక సహకారిగా నిలిచాయి. ఏపీ 17.7 శాతం నుంచి 39.1 శాతానికి పెరిగి అగ్రభాగంలో నిలిచింది. 2011-12 నుంచి 2022-23 మధ్య గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి విలువ 2011-12లో ఉమ్మడి ఏపీలో 9.3 శాతం ఉంటే, 2023-24 నాటికి తెలంగాణ 6.9 శాతం, విభజిత ఆంధ్రప్రదేశ్ 8.9 శాతం నమోదు చేసుకున్నాయి.