నవతెలంగాణ-హైదరాబాద్: పూరీ తొక్కిసలాట ఘటనపై ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్, పూరీ ఎస్పిలపై బదిలీ వేటు వేసింది. ఆదివారం తెల్లవారుజామున పూరీ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించగా, 50మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పూరీ పోలీస్ సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్లను బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖుర్దా కలెక్టర్ చంచల్ రాణా నూతన జిల్లా మేజిస్ట్రేట్గా బాధ్యతలు స్వీకరిస్తారని, ప్రస్తుతం ఏడీజీ (క్రైమ్)గా ఉన్న సీనియర్ పోలీసు అధికారి పినాక్ మిశ్రా ఎస్పీగా విధుల్లో చేరతారని వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.