– ఆదివాసీి మహిళల ఉత్పత్తుల ప్రస్తావన
– మన్కీబాత్లో ప్రధాని మోడీ
– నిరుద్యోగ యువతులు వ్యాపార రంగంలో రాణించాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
నవతెలంగాణ-భద్రాచలం
మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయికే కాదు అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లిందంటూ.. ఐటీడీఏ భద్రాచలం పేరును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.123 వ మన్కీబాత్ ఎపిసోడ్లో తెలంగాణ భద్రాచలంలోని ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని ప్రస్తావించారు. అవి హైదరాబాద్ నుంచి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. ఈ మహిళలే మూడు నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారన్నారు.
ఆనందంగా ఉంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చాలా ఆనందంగా ఉందని, అందుకు మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. నిరుద్యోగులైన గిరిజన యువతులు ప్రపంచంలో పోటీపడి డిమాండ్ను బట్టి వ్యాపారం చేసి నష్టపోకుండా అధిక లాభాలు పొంది, జీవనోపాధి పెంపొందించుకోవాలని తెలిపారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గిరిజన యువతులు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీడీఏ పీఓ బి.రాహుల్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ కలిసి యువతులకు వ్యాపారంలోని మెలకువలు, సలహాలు, సూచనలు అందించారు. అనంతరం పీఎంఆర్సీ శ్రీరామ జాయింట్ లియాబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ని సంప్రదించి బిస్కెట్ల తయారీ కోసం కొనుగోలు చేసే ముడి సరుకుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు, నెయ్యి ఇతర వస్తువులు బయట నుంచి కాకుండా మన పంట పొలాల్లో రాగులు, సజ్జలు పండించుకోవాలని సూచించారు. నెయ్యిని మాత్రం మన గ్రామాల్లోనే పశుసంపద ఎక్కువగా ఉన్నందున స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేసుకోవాలన్నారు. ఇదే స్ఫూర్తితో ఎటువంటి కల్తీ లేని ఆర్గానిక్ తినుబండారాలు తయారు చేసి మ్యూజియం, దేవస్థానంకు వచ్చే భక్తులకు అందించాలని అన్నారు. మిల్లెట్ బిస్కెట్లకు సంబంధించిన బ్రాండింగ్ స్టిక్కర్లు సెలెక్ట్ చేసి ఐటీడీఏకు మంచి గుర్తింపు వచ్చేలా చూడాలని తెలిపారు. కుట్టు శిక్షణ నేర్చుకున్న యువతులను హైదరాబాద్ పంపించి బొంబాయి, పూణే నుంచి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్లతో మమేకం చేసి కొత్త కొత్త డిజైన్లు తయారు చేసే విధంగా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. నేర్చుకున్న వారు తమ గ్రామాల్లోని మహిళల డిమాండ్ను బట్టి బట్టలు డిజైనింగ్ చేయాలన్నారు. వాటిని హైదరాబాద్లోని శిల్పారామంలో అమ్ముకునే విధంగా అవకాశం కల్పిస్తామని అన్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలు.. గ్రామంలోని అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ పాఠశాలల పక్కన కుట్టుమిషన్ల వర్క్ షెడ్లను ఈజీఎస్ ద్వారా కట్టించుకొని వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్లను పీవో బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మకు యువతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీశ్, ఏసీఎంవో రమేశ్, టీఏ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ఐ నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ తయారీ మహిళలు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్పై ప్రధాని ప్రశంస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES