Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆగమౌతున్న అడవిబిడ్డలు

ఆగమౌతున్న అడవిబిడ్డలు

- Advertisement -

– భయపెడుతున్న జీవో 49
– పులుల సంరక్షణ పేరుతో అడవికి దూరం చేసే కుట్ర
– అటవీ ప్రాంతాల్లో ఆగిన అభివృద్ధి పనులు
– మంత్రుల తడబాటు
– ఉధృతమౌతున్న ఆదివాసీ, గిరిజన ఆందోళనలు
– జీవో రద్దు చేయాలని డిమాండ్‌
– మోడీ బాటలోనే రేవంత్‌ సర్కార్‌ అంటూ విమర్శలు
– అడవిని కాపాడేది గిరిజనులే…
వాళ్ళే లేకుంటే కార్పొరేట్లు ఏనాడో విలువైన అటవీ సంపదను కొల్లగొట్టేవాళ్లు. గిరిజనం అడవి పచ్చగా ఉండాలనే కోరుకుంటారు. తమ బ్రతుకులు అడవితో ముడిపడి ఉన్నాయని విశ్వసిస్తారు. అందుకే వనదేవతల పేరుతో ప్రకృతిని పూజిస్తారు. అడవిపై కనీస పరిజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా అర్థమయ్యే మాటలు ఇవి. మణిపూర్‌ అల్లర్ల వెనుక అక్కడి అటవీ సంపద, దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే మోడీ సర్కార్‌ తాపత్రయం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లాలో పులుల సంరక్షణ పేరుతో జీవో నెంబర్‌ 49 విడుదల చేసి, అక్కడి ఆదివాసీలను అడవికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఆదివాసీ, గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమబాట పట్టి, ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎస్‌. వెంకన్న

ఆదివాసీ, గిరిజన హక్కుల సంరక్షణ కోసం పోరాడి సాధించుకున్న చట్టాలకు తూట్లు పడుతున్నాయి. వారిని అడవి నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో నెంబర్‌ 49 విడుదల చేసింది. 2006 నాటి అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) ద్వారా గిరిజన తెగలన్నింటికీ అడవిపై హక్కులు ఉన్నాయి. తాము స్వచ్ఛందంగా అంగీకరించి ఖాళీ చేస్తే తప్ప రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నివసించే హక్కును వారికి ఆ చట్టం కల్పించింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు వారికి టైటిల్‌ డీడ్స్‌ కల్పించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గిరిజనులకు నేటికీ అవి అందలేదు. ఎఫ్‌ఆర్‌ఏ కేవలం కాగితం పులిగా మిగిలిపోయింది.
కార్పొరేట్ల కోసమే..
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల ఏర్పాటు పేరుతో లక్షలాది మంది గిరిజనులను ఇప్పటికే మోడీ ప్రభుత్వం నిరాశ్రయులను చేసింది. దేశంలో ఉన్న పులుల సంరక్షణ ప్రాంతాల (టైగర్‌ రిజర్వ్‌) నుంచి 64,801 కుటుంబాలు ఉన్న 591 గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ గతేడాది జూన్‌ 19న అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని యాభై టైగర్‌ రిజర్వ్‌ల నుంచి ఐదున్నర లక్షల మంది గిరిజనులు, గిరిజనేతరులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. షెడ్యూల్డ్‌ తెగల వారిని టైగర్‌ రిజర్వ్‌ల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం సహా అనేక చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా ఇది విరుద్ధమని గుర్తు చేస్తున్నారు. ఆదివాసీ, గిరిజనులు తమ ఆవాసాలుగా భావించే నదులు, అడవులు, కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్ల నుంచి తరిమేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 49పై చర్చ జరుగుతున్నది.
జీవో 49 రద్దు చేయాలి : జాన్‌ వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
టైగర్‌ కారిడర్‌ పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేయడం సరికాదు. వారు సాగుచేసుకుంటున్న భూములు, నివాసాల నుంచి తరిమికొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలి. అడవులు అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో భాగంగానే, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 49 తీసుకొచ్చింది. దీన్ని తక్షణమే రద్దు చేయాలి. ఛత్తీస్‌ఘడ్‌ అటవీ ప్రాంతంలో 4 లక్షల ఎకరాలను కేంద్ర ప్రభుత్వం ఆదానీకి అప్పగించింది. దానికోసమే టైగర్‌ కారిడర్‌ల పేరుతో అటవీ భూముల్ని తీసుకుంటున్నది. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాల కోసం దరఖాస్తులు వస్తే, కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టాలిచ్చింది. మిగిలిన 8 లక్షల ఎకరాల సాగు భూమికి కూడా ఇస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. ఏడాది దాటినా హామీ అమలు చేయలేదు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడాలి.
హక్కుల ఉల్లంఘనే..: పూసం సచిన్‌, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
కాంగ్రెస్‌ ప్రభుత్వం కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిరక్షణ పేరుతో జారీ చేసిన జీవో 49 గిరిజనులు, ఆదివాసీలకు జీవన్మరణ సమస్యగా మారింది. పెసా, ఇతర గిరిజన హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ జీవోను జారీ చేశారు. అడవుల నుంచి ఆదివాసీ, గిరిజన గూడేలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలను సాగనివ్వం. సంఘటిత పోరాటాలతో మా హక్కుల్ని కాపాడుకుంటాం.

ఇదీ సమస్య
ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్ల పరిధిలో పది మండలాలు, 339 గ్రామాల్లోని సుమారు ఐదు లక్షలమంది జనాభాతో కూడిన 1,49,288.88 హెక్టార్ల ప్రాంతాన్ని పెద్దపులుల సంరక్షణ కోసం ‘కొమరంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు’ పేరుతో మంత్రి కొండా సురేఖ నిర్వహిస్తున్న అటవీశాఖ ద్వారా ఈ ఏడాది మే 30న జీవో నెంబర్‌ 49 జారీ చేసింది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వును మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్‌ రిజర్వుతో కలుపుతున్న ప్రాంతాన్ని ‘కుమురంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా అటవీ శాఖ ప్రకటించింది. ఆ రిజర్వ్‌ జోన్‌ ఏర్పాటుతో అసిఫాబాద్‌ జిల్లాలోని ఆదివాసీలు తీవ్ర బయాందోళనలకు గురవుతున్నా రు. వాళ్లను అడవి నుంచి బయటకు రప్పించేందు కు ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడామనీ, వారు అంగీకరించారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఎక్కడా గ్రామ సభలు నిర్వహించలేదు. కేవలం 12 మంది సభ్యులతో కూడిన రిజర్వు పరిరక్షణ నిర్వాహణ కమిటీని మాత్రమే వేశారు. వారిలో నలుగురు సర్చంచ్‌లు, ముగ్గురు ఎన్‌జీవోలు ఉన్నారు. గమ్మత్తేంటంటే ఆయా సర్పంచ్‌లు తాము ఈ కమిటీల్లో ఉన్నట్టు కూడా వారికి తెలీదు. ఈ విషయాన్ని వారే స్వయంగా స్థానిక ప్రజలకు చెప్పుకుంటున్నారు.

నమ్మేదెలా?
జీవో 49 విడుదలకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘ చర్చే జరిగింది. మంత్రులు దనసరి అనసూయ సీతక్క, ఆదిలాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వంటి వారూ ఆ సమావేశంలో ఉన్నారు. జీవో విడుదల అయ్యి, సర్కారు కుతంత్రాన్ని ఆదివాసీ, గిరిజన సంఘాలు ఎండగట్టడం మొదలయ్యాక, మంత్రులు స్వరం మార్చారు. మంత్రివర్గంలో దీనిపై చర్చే జరగనట్టు, తమకు తెలీకుండానే జీవో విడుదల అయినట్టు వీరిద్దరూ మాట్లాడుతు న్నారనేది ఆయా సంఘాల ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నవారే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పడం ఏంటనేది ఆ సంఘాల ప్రధాన ప్రశ్న. మరోవైపు మంత్రులు జీవో 49పై ప్రభుత్వ గెజిట్‌ విడుదల కాలేదనీ, దాన్ని అమలు చేయబోమనీ నమ్మబలుకుతున్నారు. ఆ జీవోను రద్దు చేయిస్తామనీ చెప్తున్నారు. అసలు మంత్రివర్గంలో దీనిపై చర్చ జరుగుతున్నప్పుడే మీరెందుకు అడ్డుకోలేదనేదే ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రశ్న.
ఇదేం అరాచకం…
జీవో 49 వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం లేదంటూ అధికారులు, మంత్రులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అమలు చేయట్లేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిలిపేశారు. ఐటీడీఏ శాంక్షన్‌ చేసిన బోరు బావులు, కరెంటు, రోడ్ల నిర్మాణం, కల్వర్టులు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే, ఆదివాసీ, గిరిజనులపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. అక్కడి ప్రజాప్రతినిధుల మాటనూ పట్టించుకోవట్లేదు. దీనితో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -