నవతెలంగాణ -ముధోల్
రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ నివాసికి జడ్పీటిసి టికెట్లు కేటాయించాలని వాదన తాజాగా తెరమీదకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని సంకేతాలు ఇవ్వటంతో ఆశావాహులు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ముధోల్ మండలంలో ఇప్పటివరకు ఆయా గ్రామాల కు చెందిన వారు జడ్పిటిసిలుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ముధోల్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయా పార్టీల్లో తమకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ముధోల్ మాజీ సర్పంచ్ బోయిడి అనిల్ జడ్పిటీసి బరిలో ఉంటానని ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఆయా పార్టీలు ముధోల్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని డిమాండ్ ను తెర మీదకి తెచ్చారు. దీంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే మాజీ సర్పంచ్ ముధోల్ లోని ఆయా నాయకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ముధోల్ లో ఉన్న ఆయా సంఘాల నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం.
రానున్న ఎన్నికల్లో ముధోల్ వాసి కే జడ్పిటిసి టికెట్ కేటాయించాలన్న డిమాండ్ తెరమీదకి రావటం చర్చనీయాంశం గా మారింది . అయితే ఆయా గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు సైతం జడ్పిటిసి బరిలో ఉండటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ముధోల్ అభ్యర్థికి టికెట్ కేటాయించాలని డిమాండ్ రావడంతో ఆయా పార్టీల ఇన్చార్జిలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి..!