నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గాని తన భార్య బుష్రా బీబీకి జైలులో ఏదైనా జరిగితే, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ను జవాబుదారీగా చేయాలని పేర్కొన్నారు. హంతకులకు, ఉగ్రవాదులకు జైలులో తన కన్నా మెరుగైన సౌకర్యాలు కల్పించారని ఆరోపించారు. పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ దంపతులు ప్రస్తుతం అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమాఖాన్ సోషల్మీడియాలో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో ద్వారా ఇమ్రాన్ తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలకు ఈ సందేశాన్ని పంపారు.
ఇటీవలి రోజుల్లో జైలులో పరిస్థితులు కఠినంగా మారాయని, తన భార్య బుష్రా బీబీకి కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ తన సుధీర్ఘ పోస్ట్లో పేర్కొన్నారు. ఆమె ఉన్న జైలుగదిలో టీవీని ఆపేశారని అన్నారు. ఖైదీలకు చట్టబద్ధంగా మంజూరు చేయాల్సిన అన్ని ప్రాథమిక హక్కులు తమకు నిలిపివేశాకని పేర్కొన్నారు. ఇటువంటి కఠినమైన ప్రవర్తనకు జవాబుదారీనతం ఉండాలని అయన అన్నారు. ఒక కల్నల్, జైలు సూపరింటెండెంట్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారని తెలుసునని పేర్కొన్నారు. అందుకే తన పార్టీ సభ్యులకు సూచనలు ఇస్తున్నానని, జైలు తమకు ఏదైనా జరిగితే అసిమ్ మునీర్ జవాబుదారీగా చేయాలని అన్నారు.
జీవితాంతం జైలులో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ నిరంకుశత్వం, అణిచివేత ముందు తలవంచే ప్రసక్తే లేదని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అణిచివేతకు లొంగిపోవద్దని ప్రజలకు సూచించారు. చర్చల సమయం ముగిసిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనకు సమయం ఆసన్నమైందని అన్నారు. శిక్ష పడిన హంతకులు, ఉగ్రవాదులను కూడా తనకంటే మెరుగైన పరిస్థితుల్లో ఉంచారని పేర్కొన్నారు.
తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎస్ఐ చీఫ్గా అసిమ్ మునీర్ను తొలగించినపుడు, అతను తన భార్యకు ఒక సందేశాన్ని పంపాడని, సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరాడని, కానీ ఆమె నికారించిందని అన్నారు. ఫలితంగా అసిమ్ మునీర్ వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకున్నాడని, తన భార్యను లక్ష్యంగా చేసుకుని తనపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తన సందేశాన్ని రీట్వీట్ చేయాలని పార్టీ సభ్యులను కోరారు.