ముంబయి : ఎన్సిపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య కేసులో 13 మంది నిందితులకు ఈ నెల 16 వరకూ పోలీసు కస్టడీ విధిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిద్దికి హత్య కేసును ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్ సహా 26 మందిని అరెస్టు చేసింది. వీరిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసిఒసిఎ)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని సోమవారం ఎంసిఒసిఎ కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసులో ఆర్థిక కోణాలను గురించి కూడా విచారించాల్సిన అవసరం ఉందని, కస్టడికి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నెల 16 వరకూ వారికి కోర్టు కస్టడీ విధించింది. ఈ కేసులో అరెస్టయిన మిగిలిన నిందితులు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ రాత్రి ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో బాబా సిద్దికిని కాల్చి చంపారు.