Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయండాలర్‌ను ఎదిరిస్తే సుంకాలు తప్పవు

డాలర్‌ను ఎదిరిస్తే సుంకాలు తప్పవు

- Advertisement -

నా హెచ్చరికతో బ్రిక్స్‌ దేశాల్లో వణుకు : క్రిప్టోకరెన్సీ చట్టం ఆమోదించాక ట్రంప్‌ వ్యాఖ్యలు
శ్వేతసౌధం:
బ్రిక్స్‌ కూటమిలోని దేశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. డాలర్‌ ఆధిపత్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో ఈ దేశాల ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో క్రిప్టోకరెన్సీ చట్టాన్ని ఆమోదించిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బ్రిక్స్‌ కూటమిని లక్ష్యంగా చేసుకున్నారు. బ్రిక్స్‌ చిన్న సమూహమని, అది వేగంగా పతనమవు తోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ను, దాని ఆధిపత్యాన్ని, ప్రమాణాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయనీ, అలాంటి చర్యలను సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. అమెరికా కరెన్సీ పతనాన్ని తాను అనుమతించబోనని చెప్పారు. తన సుంకాల హెచ్చరిక తర్వాత జరిగిన బ్రిక్స్‌ సమావేశానికి హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. వారు సుంకాలను చెల్లించదలు చుకోలేదని, అందుకే సమావేశానికి రావడానికి కూడా భయపడుతున్నారని ట్రంప్‌ ఎద్దేవా చేశారు.

ఆ చర్చే ట్రంప్‌ కోపానికి కారణం
బ్రిక్స్‌ అనేది బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఆర్థిక కూటమి. గతేడాది ఈ కూటమిలో ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవడం ద్వారా విస్తరించింది. బ్రిక్స్‌ కూటమి అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం గురించి చర్చించింది. అయితే, సభ్య దేశాలు ఈ లక్ష్యంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ డాలర్‌ ఆధిపత్యంపై చర్చ జరిగిన తర్వాత బ్రిక్స్‌ కూటమిపై అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది.

అమెరికా డాలర్‌ ప్రపంచ ముడి చెల్లింపుల కరెన్సీగా ప్రాముఖ్యం కలిగి ఉంది. ఆయిల్‌ కొనుగోలు నుంచి అంతర్జాతీయ రుణాల వరకు చెల్లింపులన్నీ డాలర్‌ రూపంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్‌ దేశాలు ”డీ-డాలరైజేషన్‌” పేరుతో స్థానిక కరెన్సీల వాడకంపై చర్చలు జరుపుతున్నాయి. ఇది అమెరికాకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా హాని చేయవచ్చని ట్రంప్‌ భావిస్తున్నారు. ఆ కారణంగానే బ్రిక్స్‌ దేశాలను ఒత్తిడి చేయడం కోసం టారిఫ్‌ల పేరుతో హెచ్చరిస్తున్నారు.

డీ-డాలరైజేషన్‌ పై భారత్‌ ఏమన్నదంటే
ఇండియా, బ్రెజిల్‌ వంటి దేశాలు ఇప్పటివరకు ‘డీ-డాలరైజేషన్‌’పై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే జులై 17న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌…
స్థానిక కరెన్సీలు ఉపయోగించడంపై బ్రిక్స్‌ దేశాలు చర్చిస్తున్నాయనీ, డాలర్‌ను తగ్గించాలన్నది తమ ఎజెండా కాదని పేర్కొన్నారు. అయితే కరెన్సీ సమస్యలపై బ్రిక్స్‌ దేశాలను ట్రంప్‌ బెదిరించడం ఇది మొదటిసారి కాదు. 2024లో బ్రిక్స్‌ కూటమి డాలర్‌కు పోటీగా సొంత కరెన్సీని సష్టించడానికి ముందుకు వెళ్తే వంద శాతం సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు.
ఇక అమెరికా సుంకాల అమలుకు ఆగస్టు 1ను గడువుగా ట్రంప్‌ నిర్ణయించారు. అంతకుముందు జులై 9న వాణిజ్య ఒప్పందాల కోసం విధించిన గడువు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందాలు కుదరకపోతే సుంకాల రేట్లను వివరిస్తూ దేశాలకు లేఖలు పంపుతానని ట్రంప్‌ తెలిపారు. ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందం చేసుకోని ఆయా దేశాలకు ట్రంప్‌ స్వయంగా లేఖలు పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -