నవతెలంగాణ-హైదరాబాద్: టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఇషాక్ దార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ.. ‘టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. యూఎస్ నిర్ణయంతో మాకు ఎలాంటి సమస్యా లేదు. వారి ప్రమేయం ఉందని ఆధారాలు ఉంటే అలా చేయొచ్చు. మేము స్వాగతిస్తాము’ అని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇషాక్ దార్ పేర్కొన్నారు. అయితే, టీఆర్ఎఫ్కు లష్కరే తోయిబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని స్పష్టం చేశారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరాన్ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మారణహోమానికి తామే బాధ్యులమని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(TRF) ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.