నవతెలంగాణ-సిటీబ్యూరో
జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్కు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమిషనర్ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులయ్యారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్, డిప్యూటీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్, జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనసకి నియామకపత్రం అందజేశారు. పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ”భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం, కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుంచి విపరీతమైన ఆసక్తిని చూస్తుంది” అని తెలిపారు. డా.పనస వ్యాపార ప్రపంచంలో ఎంతో అనుభవాన్ని సంపాదించడంతో పాటు, వ్యాపార నిర్వహణ, మీడియా ప్రమోషన్లలో యూనెస్కో ఐఎస్సీఈడీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన నాయకత్వంలోని పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎంఎల్ లగ్జరీ స్పిరిట్స్, పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్, పనస ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.