నవతెలంగాణ-హైదరాబాద్ : కొలంబియా దేశంలో రెండు భయానక ఘటనలు చోటుచేసుకున్నాయి. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) రెండు వేర్వేరు ఉగ్రదాడులు జరగడంతో 17 మంది మరణించారు. అంతియోక్వియా ప్రాంతంలో కొకైన్ ఉత్పత్తికి ఉపయోగించే కోకా మొక్కల సాగును తొలగించే కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది హెలికాప్టర్లో బయలుదేరారు. ఈ హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్తో మొదటి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి హెలికాప్టర్లో భారీగా మంటలు చెలరేగేలా చేసింది. ఇక ఈ ఘటనలో 12 మంది పోలీసు అధికారులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దాడి ఇటీవల జరిగిన కోకైన్ పట్టివేతకు ప్రతీకార చర్యగా జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెండో దాడి కాలి నగరంలో మిలిటరీ ఏవియేషన్ స్కూల్ సమీపంలో జరిగింది. కారు బాంబు పేలడంతో ఐదుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకు కారణంగా దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ దాడులకు మాజి వామపక్ష ఉగ్రవాద సంస్థ అయిన ఫార్క్ లోని విపక్ష గ్రూపులు బాధ్యత వహించాయని తెలిపారు. ఈ మేరకు కారు బాంబు పేలిన ప్రాంతంలో ఒక నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.