– అనాజ్పూర్ రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-హైదరాబాద్ : అనాజ్పూర్ భూపోరాటం సందర్భంగా ఈ రోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ నర్సింహా, రైతుసంఘం జిల్లా నాయకులు భాస్కర్రెడ్డిని, సంబంధిత రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ దుశ్చర్యను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు అయినవారిని తక్షణమే విడుదల చేసి, బాధిత రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చి, ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ రెవెన్యూ సర్వేనంబర్లు 274, 275, 276, 277, 278 మరియు 281లో 125 ఎకరాల సీలింగ్ భూమిని 125 మంది పేదలకు 1991 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ చేసి, సర్టిఫికేట్లు, పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసింది. అట్టి భూములను నాటి నుండి నేటి వరకు ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. కానీ ధరణి పోర్టల్ ఆన్లైన్లో రైతుల పేర్లు నమోదు చేయలేదు. ధరణి పాసుపుస్తకం ఇవ్వలేదు. దీంతో రైతు భరోసా, రైతుబీమా, పీఎం కిసాన్ సమ్మన్ నిధి, బ్యాంకులోన్లు రాక ఈ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తమకు కొత్త పాసుపుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధిత రైతులు గత ఎనిమిదేళ్ళుగా అనేకసార్లు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దారును కలిసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) అబ్దుల్లాపూర్మెట్టు మండల కమిటీ బాధిత రైతులకు అండగా నిలబడిరది. ఈ రోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీతో పాటు, బాధిత రైతులు భూమి దగ్గరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వారిని అక్రమంగా అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని, తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
జాన్వెస్లీతో పాటు, సీపీఐ(ఎం) నాయకుల అరెస్టును ఖండించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES