నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి తీరుపై జనం ఆగ్రహించారు. గ్రామ సందర్శనకు వచ్చిన ఆయనపై దాడికి ప్రయత్నించారు. తప్పించుకుని పారిపోయిన మంత్రిని కిలోమీటరు దూరం వరకు వెంబడించి తరిమారు. ఎన్డీయే పాలిత బీహార్లో ఈ సంఘటన జరిగింది. గతవారం రోడ్డు ప్రమాదంలో 9 మంది వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రావణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి బుధవారం ఉదయం జోగిపూర్ మలవాన్ గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు.
కాగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మంత్రి శ్రావణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేను వారు చుట్టుముట్టారు. గ్రామాన్ని ఆలస్యంగా సందర్శించడం, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపకపోవడం, ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంపై జనం ఆగ్రహించారు. అధికార జేడీయూ నేతలపై దాడికి ప్రయత్నించారు. జనం దాడి నుంచి మంత్రి తప్పించుకోగా ఆయన బాడిగార్డు గాయపడ్డాడు.
అనంతరం మంత్రి శ్రావణ్ కుమార్ తన కాన్వాయ్ వరకు పరుగెత్తారు. వాహనాల్లో పారిపోతున్న మంత్రి, ఎమ్మెల్యేను కిలోమీటరు దూరం వరకు గ్రామస్తులు వెంబడించి తరిమారు. అప్రమత్తమైన పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.