నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ దేశ మంగళవారం రాజధాని ప్రాంతంలోనూ, నోయిడా, హర్యానాలో గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. గురుగ్రామ్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా, నేడు పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్రాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల హర్యానా రాజధాని చండీగఢ్లో విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అవసరమైతే.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల్ని తీసుకోవచ్చని విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. హర్యానాలో గురుగ్రామ్లో వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇక ఢిల్లీలో రాజధాని ప్రాంతంలో వర్షం వల్ల ఏడు కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.