– హంతకున్ని తక్షణమే అరెస్ట్ చేయాలి.
నవతెలంగాణ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చిన్నారులతో సహా ఆరుగురిని కసాయిలా నరికి పొట్టనబెట్టుకున్న నరమేధంపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈ విషాదకర ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఈ పాశవిక చర్యకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూడాలని, నిందితుడికి బెయిలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
ఈ ఘటన జరిగి సమయం గడుస్తున్నా, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి వ్యక్తం అవుతుంది. హంతకున్ని అరెస్ట్ చేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారికి తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.


