కార్పొరేట్ల చేతిలో 40 శాతం దేశ సంపద
పత్రికలు ప్రజల గొంతును వినిపించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రదాని మోడీ హయాంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ నిర్వీర్యమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఈ మూడు వ్యవస్థలు, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన నవతెలంగాణ దినపత్రిక పదకొండో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో ఫాసిస్టు హిందూత్వ మౌఢ్యాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. దేశ సంపదను కాపాడాల్సిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే వాటిని కార్పొరేట్లకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 40 శాతం సంపద వారి చేతుల్లో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయని గుర్తు చేశారు. విద్య వ్యాపారంగా మారి సామాన్యునికి అందకుండా పోయిందని తెలిపారు. 30 కోట్ల మంది పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మోడీ సర్కార్ వారికి అందకుండా చేసిందన్నారు.
కనీస వేతనాలు, అటవీ హక్కులు, ఓటు హక్కు మృగ్యమయ్యాయని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మోడీ, అమిత్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితులు, ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సర్కార్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని అన్నారు. విద్యార్థుల హక్కులు కాపాడాలని జెన్ జీలు ఢిల్లీలో సాగించిన పోరాటంపై కేంద్రం పాశవికంగా దాడి చేసిందన్నారు. ఇదే అదనుగా గోడీ మీడియా యువత పోరాటానికి తప్పుడు బాష్యాలు చెప్పిందని విమర్శించారు. దశాబ్ద కాలానికి పైగా నవ తెలంగాణ అదే విధంగా పని చేస్తూ తన వంతు కృషిని కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.



