నవతెలంగాణ-హైదారాబాద్: ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ డిమాండ్ మేరకు పెల్లెట్ గన్స్ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాధితుని వైద్య నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి.
గత నెల జూలై 20న నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పార్లమెంట్ మార్చ్ కు శాంతియుత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పెల్లెట్ గన్ లతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల సాహిల్ కు తీవ్ర గాయాలైయ్యాయి. బాధిత యువకుడితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సాహిల్ ఆరోపించాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.కేసు నమోదు చేసేవరకు స్ట్రేషన్ నుంచి కదిలేది లేదని, నెల రోజులైనా, ఆరు నెలలైన ధర్నా చేస్తానని రాహుల్ గాంధీ భీష్మించారు.
మరోవైపు ఆనాటి ఘటనపై సుప్రీంకోర్టు గురువారం ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని (హెచ్పిఇసి) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం, ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్.ఆర్. బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది.



