నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు, ఇతర ప్రముఖుల పర్యటనలను.. రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు.ప్రతిపాదిత కార్యక్రమం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని, అమెరికా పర్యటన అంశంలో అలా లేదని జైస్వాల్ స్పష్టం చేశారు..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కోసం న్యూఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం అర్థరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం.. ఆగస్టు 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో సీఎం బృందం పర్యటించనుంది. కానీ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వ లేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి రానున్నారు. అయితే యూఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.



