నవతెలంగాణ-హైదరాబాద్: 2026 బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2026 ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరగనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) సోమవారం ప్రకటించింది. దీంతో 17ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మరోసారి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. 2009లో హైదరాబాద్ వేదికగా తొలిసారి బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి.
2025 బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఫ్రాన్స్ వేదికగా ఆదివారంతో ముగియడంతో తర్వాత టోర్నమెంట్ ఆతిథ్య హక్కుల ప్రకటనను నిర్వాహకులు వెల్లడించాయి. ఆతిథ్య హక్కులు భారత్కు దక్కడంతో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బారు) అధ్యక్షులు మిశ్రా బిడబ్ల్యుఎఫ్ నిర్వాహకులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లో పివి సింధు ఓటమిపాలై తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట సెమీస్లో ఓటమిపాలైనా.. కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 2025 బిడబ్ల్యుఎఫ్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకాన్ని షీ-యూకీ(చైనా), విదిత్ శరణ్(మలేషియా) రజత పతకాన్ని, ఆంటోన్సేన్(డెన్మార్క్), విక్టర్ లీ(కెనడా) కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు. మహిళల సింగిల్స్లో బంగారు పతకాన్ని యమగుచి(జపాన్), చెన్ యుఫీ(చైనా) రజత పతకాన్ని సాధించగా.. అన్-సే యంగ్(కొరియా), వార్డానీ(ఇండోనేషియా) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.