– కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..
– 34 ఓట్ల తేడాతో బీఎంఎస్పై గెలుపు
– ఇది ముమ్మాటికీ కార్మికుల విజయమే : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, యూనియన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్
నవతెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రానే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ విజయఢంకా మోగించింది. బీఎంఎస్పై 34 ఓట్ల తేడాతో సీఐటీయూ విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 155 ఓట్లు ఉండగా.. సీఐటీయూకు 94, బీఎంఎస్కు 60 ఓట్లు పడ్డాయి. ఒకరు ఓటు వేయలేదు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు చుక్క రాములు, యూనియన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ మాట్లాడారు. ఇది కార్మికుల విజయమని, పరిశ్రమలో సీఐటీయూని నాలుగోసారి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులకు హామీ ఇచ్చినట్టుగా మెరుగైన వేతన ఒప్పందంతో పాటు, మరిన్ని మంచి సంక్షేమ పథకాలు తెస్తామని.. కార్మికుల రిటైర్మెంట్ 60ఏండ్లకు పెంచుతామన్నారు.
బీఎంఎస్ కల్లబొల్లి మాటలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేసినా కార్మికులు నమ్మలేదని తెలిపారు. సీఐటీయూ ద్వారానే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందని కార్మికులు మరోసారి రుజువు చేశారన్నారు. గెలిచిన అనంతరం కార్మికులందరూ నాయకులకు పూలమాలలు వేసి సత్కరించారు. టపాకాయలు కాల్చి, సీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పరిశ్రమ నుంచి గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కామని గోపాలస్వామి, పరిశ్రమ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉప ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి, చంద్రశేఖర్రెడ్డి, నర్సింలు, సాజిద్, వెంకట్రావు, శ్రీనివాస్, రంగారెడ్డి, రాజగోపాల్, ఏ.స్వామి తదితరులు పాల్గొన్నారు.
రాణేే బ్రేక్ లైనింగ్ పరిశ్రమలో సీఐటీయూ విజయఢంకా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES