నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం దారుణంగా ముగిసింది. బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన మైథిలీప్రియ అనే యువతి, తన పూర్వ ప్రియుడి చేతిలో కత్తిపోటుకు గురై మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, బీఫార్మసీ పూర్తి చేసిన మైథిలీప్రియ (23), విద్యాభ్యాస సమయంలో రాపూరు మండలానికి చెందిన నిఖిల్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే, నిఖిల్ ఇటీవల మరొక యువతితో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ప్రస్తుతం బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మైథిలీప్రియ, పది రోజుల క్రితం నెల్లూరుకు వచ్చింది. నిఖిల్ ఫోన్ చేసి మాట్లాడాలని పిలవడంతో, ఆమె తన చెల్లెలు ఇంట్లో ఉండగా నిఖిల్ వద్దకు వెళ్ళింది. నిఖిల్ తన గదిలో మైథిలీప్రియపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మైథిలీప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ తరువాత, నిఖిల్ మైథిలీప్రియ సోదరికి ఫోన్ చేసి, వారి మధ్య గొడవ జరగడం వల్ల కత్తితో పొడిచానని చెప్పాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.