Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

- Advertisement -

ఆ స్ఫూర్తితోనే భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలి
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ : సంగారెడ్డిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. అసలు ఈ పోరాటంతో సంబంధమేలేని బీజేపీ తెలంగాణ విమోచనం పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని ఐబీ అతిథి గృహం నుంచి ర్యాలీ నిర్వహించారు. దీన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు జెండా ఊపి ప్రారంభించారు. ప్రదర్శన కొత్తబస్టాండ్‌ మీదుగా చౌరస్తాలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17వ తేదీ ప్రజలు జ్ఞాపకం పెట్టుకునే రోజు అని అన్నారు. దీని గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఆ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలోనే నైజాం ప్రభుత్వం నుంచి సర్దార్‌ వల్లభారు పటేల్‌ సైనిక చర్య ద్వారా తెలంగాణను విముక్తి చేశామని గొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు. అలాగైతే దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే నైజాం ప్రభుత్వాన్ని కూల్చేం దుకు 13 నెలలు సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఈ రెండు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచి దొరలు, జాగీర్దారులు, పటేల్‌, పట్వారీలు, నైజాం రజాకార్‌ మూకలకు వ్యతిరేకంగా జరిపిన మహౌన్నత పోరాటమే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని విశ్లేషించారు. వీరిలో హిందు వులు, ముస్లింలు, ఇతర మతస్తులు కూడా ఉన్నారని చెప్పారు. ఆ ఉమ్మడి మతసామరస్య వారసత్వాన్ని ఇప్పుడు బీజేపీ తమ మతోన్మాద రాజకీయ ప్రయోజ నాలకోసం వాడుకుంటోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వా నికి, ఆనాటి నైజాం సర్కార్‌కు పాలనలో ఎలాంటి తేడాలు లేవని వివరిం చారు. ఆనాటి నిజాం ప్రభువు తెలు గును అణచి వేసి వారి మాతృభాష అయిన పర్షి యన్‌, ఉర్దూలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారనీ, ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహాలో హిందీ, సంస్కృతం భాషను దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నదని తెలి పారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మల్లిఖార్జున్‌, జిల్లా కార్యదర్శి జి.జయరాజ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, ఎ.మాణిక్‌, జి.సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌ కుమార్‌, యాదగిరి, విద్యాసాగర్‌, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, బాగారెడ్డి, వాజిద్‌ అలీ, శ్రీనివాస్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఎ.నాగభూషణం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -